కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలంటే కార్మిక నేస్తం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలంటున్నది కార్మికలోకం. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఉద్యమ నేత అవసరం ఇప్పుడు దేశానికి ఎంతో ఉందంటున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో కార్మికులకు చేతినిండా పని, మూడు పూటల కడుపు నిండా భోజనం లభిస్తున్నదన్నారు. రాష్ట్ర సర్కార్ ప్రవేశపెడుతున్న అనేక పథకాలతో కార్మికులందరూ దర్జాగా బతుకుతున్నారన్నారు. ఇతర రాష్ర్టాల కార్మికులు సైతం ఇక్కడ ఉపాధి పొందుతున్నారన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ సుపరిపాలనతోనేనన్నారు. కేంద్రం కార్పొరేట్లకు కార్మికుల శ్రమను దోచిపెడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నది. ఈ తరుణంలో దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమన్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 23 ( నమస్తే తెలంగాణ)
దేశంలోని కార్మికులు, కర్షకుల సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తున్నదని, దీనిద్వారా బడా వ్యాపారులు మరింత ధనవం తులు అవుతుండగా.. పేదలు, కార్మికులు రోడ్డున పడుతున్నారని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ఉద్యమ నేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అయితే తెలంగాణ మాదిరిగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని, దేశం సుభిక్షంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు తేల్చి చెబుతున్నారు.
దేశాన్ని ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి తీసుకెళ్లింది. జీఎస్టీ మొదలుకొని అనేక రకాల పన్నులతో సామాన్యుడు చితికిపోయాడు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తూ ప్రజల సంపదను దోచుకునే వారికి ప్రధాని మోదీ తలుపులు బార్లా తెరిచారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని బాగుచేయాలంటే ఉద్యమ నాయకుడు, ప్రజల కష్టాలేమిటో క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ చేస్తున్న కృషితో.. దేశ ప్రజలంతా ఆయన వైపు చూస్తున్నారు. తమకు కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. దేశంలోని విపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అందరూ మద్దతు తెలుపుతున్నారు.
-కిరణ్కుమార్, కార్మిక విభాగం మండలాధ్యక్షుడు మర్పల్లి
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలి. కార్మికుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. కార్మికులకు న్యాయం జరుగాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వచ్చి కార్మిక చట్టాలను అమలు చేయాలి.
– కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి, కందుకూరు
తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్ల కాలంలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిపిన గొప్ప నేత సీఎం కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ప్రధాని అయితే దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. తెలంగాణ మాదిరిగా దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. సీఎం కేసీఆర్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని నదులు, వనరులను సద్వినియోగం చేసుకుని, దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తారు. అన్ని రంగాలపై అపారమైన అవగాహన ఉన్న నాయకుడు ఆయన. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా అమలై తే పెనుమార్పులు వస్తాయి.
– రాందేవ్యాదవ్, కార్మిక విభాగం అధ్యక్షుడు, షాబాద్
బీజేపీ ప్రభుత్వం మరి కొంతకాలం అధికారంలో ఉంటే కార్మికులు, కర్షకుల హక్కులను పూర్తిగా హరించి వేస్తుంది. కార్పొరేటర్లకు కార్మికుల శ్రమను దోచిపెడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే నే కార్మికుల హక్కులను కాపాడుతారు. కొత్త సంస్కరణలను తీసుకొస్తారు. కార్మికులు, కర్షకులకు మేలు జరుగుతుంది.
– భాస్కర్ ముదిరాజ్ , కార్మిక సంఘం నాయకుడు, బడంగ్పేట
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే దేశం బాగుపడు తుం ది. తెలంగాణ మాదిరి పథకాలు దేశమంతా అమలై పేదలందరికీ అందుతాయి.. వారి బతుకులు మారుతాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలను పెంచి పేదలపై మోయలేని భారాన్ని మోపుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కార్మికుల సమస్యలు కూడా పరిష్కరమవుతాయి.
-కృష్ణ, టీఆర్ఎస్కేవీ వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు
రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తున్నారు. కార్మికుల అభ్యున్నతికి అవసరమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ పెట్టి.. ప్రధాని అయితే దేశంలోని కార్మికులు, కర్షకులకు ఎంతో మేలు జరుగుతుంది. వారు కూడా గౌరవంగా జీవిస్తారు. సీఎం కేసీఆర్ వెంటనే జాతీయ పార్టీనిఏర్పాటు చేయాలి.
-కృష్ణయ్య, కార్మిక సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
దేశ రాజకీయాల్లో మార్పు రావాలంటే అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. అన్ని రంగాలపై ఆయనకు విశేషమైన అనుభవం, చతురత, సమర్థత ఉన్నది. దేశం బంగారు భారత్గా మారుతుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలుపుతాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పేదలపై పన్నులు పెంచుతూ భారం మోపుతున్నది.
– పీర్ మహ్మద్, సీపీఐ పరిగి డివిజన్ కార్యదర్శి
ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో దేశంలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. అలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే కార్మికులు, కర్షకులకు మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెంటనే రావాలి.
-చెక్క నర్సింహ, పెయింటర్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ
దేశంలోని కార్మికుల సమస్యలు పరిష్కారం కావాల న్నా..కనీస వేతనాలను అమలు చేయాలన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సీఎం కేసీఆర్ జాతీ య స్థాయి లో పార్టీని ఏర్పాటు చేసి.. ప్రధాని అయి కార్మికులు, కర్షకుల సమస్యలను పరిష్కరించాలి. ఆయనతోనే దేశాభివృద్ధి సాధ్యం.
-ఎల్లేశ్,సీఐటీయూ మండల కార్యదర్శి ఇబ్రహీంపట్నం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలు, ఇతర వర్గాలపై చేస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు లౌకికవాద శక్తులంతా ఏకతాటిపైకి వచ్చి జాతీయ స్థాయి లో ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేయాలి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నా. ఆయనతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. దేశంలోని ప్రజలందరూ మోదీ పాలనపై విసుగుచెందారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కోరుతున్నారు.
-బుగ్గ రాములు, కార్మిక సంఘం నాయకుడు ఇబ్రహీంపట్నం