చేవెళ్లటౌన్, సెస్టెంబర్ 23 : పింఛన్ కోసం లబ్ధిదారుల వయసు పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రభుత్వం 57 ఏండ్లలోపు వారితో పాటు పెండింగ్లో ఉన్న దివ్యాంగులు, వితంతువులు, ఒంటిరి మహిళలకు నూతన ఆసరా కార్డులను అందిస్తున్నది. వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు ఒంటరిమహిళలకు నెలకు రూ.2016, దివ్యాంగులకు 3016 అందిస్తూ భరోసాను కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.200 పింఛన్ 2016కు పెంచి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పింఛన్లను మంజూరు చేసి వారికి సంతోషాన్ని నింపుతున్నారు.
చేవెళ్ల డివిజన్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరిమహిళలు మొత్తం 6140 మందికి నూతన ఆసరా కార్డులను అందజేసింది. చేవెళ్ల మండలంలో 1711 మంది, షాబాద్ మండలంలో 932, మొయినాబాద్ మండలంలో 1514, శంకర్పల్లి మండలంలో 1512 మంది, శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 471 అర్హులను గుర్తించి వారికి ప్రభుత్వం నూతన ఆసరా కార్డులను అందజేసింది.
పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అన్ని వర్గాల వారిని ఏదో ఒక పథకం ద్వారా ఆదుకుంటున్నది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.200 పింఛన్ను 2016 నుంచి 3016కు పెంచి పింఛన్లు అందిస్తున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా పింఛన్లు అందేవిధంగా చూస్తా. ఇప్పుటి వరకు చేవెళ్ల డివిజన్లో 6140 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిజేశాం. వచ్చే నెలలోపు అందిరికీ ఆసరా కార్డులను అందించేందుకు కృషి చేస్తా.
కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొత్తగా ఆసరా కార్డులను మంజూరు చేయడం సంతోషంగా ఉంది. వృద్ధాప్యంలో కష్టం చేతకావడం లేదు. ఈ సమయంలో పింఛన్ డబ్బులు అందించి సీఎం కేసీఆర్ ఎంతో భరోసానిచ్చిండ్రు. మాలాంటి వారికి ముఖ్యమంత్రి పింఛన్లు అందజేసి ఆదుకుంటుండు.
– బురాన్ బుచ్చయ్య, చేవెళ్ల గ్రామం