కడ్తాల్, సెప్టెంబర్ 23 : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో వెలసిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే దసరా దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాలకు ఆలయ సిబ్బంది, నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణేశ్వరీ అమ్మవారు ప్రతి రోజూ ఒక్కో దివ్య అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను వివిధ రకాల పూలు, తోరణాలు, విద్యుదీపాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయం ముందు ఉన్న కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సావాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలిపంతూనాయక్, ఈవో స్నేహలత తెలిపారు.
దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ నెల 26న అన్నపూర్ణేశ్వరీదేవి అలంకారంలో, 27న బాలాత్రిపుర సుందరీదేవిగా, 28న గాయత్రీదేవిగా, 29న లలితాత్రిపుర సుందరీదేవిగా, 30న మహాలక్ష్మీదేవిగా, అక్టోబర్ 1న భవానీదేవిగా, 2న శ్రీసరస్వతీదేవిగా, 3న శ్రీ దుర్గాదేవిగా, 4న మహిషాసుర మర్ధినిదేవిగా, 5న శ్రీరాజరాజేశ్వరీదేవి (విజయ దశమి) అలంకరణలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
దసరా శరన్నరాత్రుల ఉత్సవాలకు ఆలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నాం. పది రోజులపాటు నిర్వహించే శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నాం. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేయాలి. -శిరోలీపంతూనాయక్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, మైసిగండి
మైసిగండిలో రామాలయ, శివాలయాల్లో శరన్నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఉత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఆవరణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
-స్నేహలత, ఈవో, మైసిగండి మైసమ్మ ఆలయం