షాద్నగర్రూరల్, సెప్టెంబర్ 23 : ఎవరైనా ఆపదలో మనసారా అమ్మవారిని తలుచుకుంటే ఆపదలు తొలగిస్తూ కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై నిలుస్తున్నది అంబ భవానీమాత. ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట అంబ భవానీ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాకతీయ కాలం నాటి అతి పురాతనమైన ఈ ఆలయానికి అనునిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల్లో ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
షాద్నగర్ పట్టణానికి 5కిలో మీటర్లు, ఎలికట్ట గ్రామం నుంచి కిలో మీటరు దూరంలో అంబ భవానీమాత దేవాలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో కాళబైరవుడు, వీరభద్రుడుస్వామి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారికి రక్షణగా ఈ క్షేత్రపాలకులు కొలువుతీరారని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆది, మంగళ, అమావాస్య రోజున జాతరను తలపించేలా భక్త సందోహం ఉంటుంది.
ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రోత్సవాలను ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అనునిత్యం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించడంతో పాటు ప్రత్యేకంగా అలంకరించి భజన, పల్లకీ సేవ, మహా మంగళహారతి, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతులను సమకూర్చారు.
షాద్నగర్ నియోజకవర్గ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా మేరకు ఎవరు కొత్త వాహనాలు కొన్నా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని వాహన పూజలు చేస్తుంటారు. అమావాస్య రోజు వాహన పూజల కోసం బారులు తీరుతారు.
మా ముత్తాతల కాలం నుంచి అమ్మవారికి సేవలు చేస్తున్నాం. అమ్మవారి సేవలోనే మా కుటుంబ కొనసాగుతున్నది. మహిమగల అమ్మవారికి సేవలు చేయడం మా పూర్వజన్మ సుకృతం. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే ఆపదలను తొలగిస్తూ ఎప్పుడూ అమ్మవారు రక్షణగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తాం.
-భవానీ శంకర్, ఆలయ ప్రధాన అర్చకుడు,అంబ భవానీమాత దేవాలయం
నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తాం. కోరినకోరికలు తీర్చే కొంగు బంగారంగా మహిమగల అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని వసతులను సమకూర్చాం.
-కృష్ణయ్య, ఆలయ కమిటీ చైర్మన్
భవానీమాత నవరాత్రోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల క్యూలైన్లను ఏర్పాటు చేస్తాం. ఆలయానికి వచ్చే భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలి. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరా ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేశాం.
-రామశర్మ, ఆలయ కార్యానిర్వహణాధికారి