రంగారెడ్డి, సెప్టెంబర్ 23, (నమస్తే) : ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. జిల్లాలో గురువారం నుంచి దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా, రెండు రోజుల్లో 650 దరఖాస్తులకు సంబంధించి పరిశీలన ప్రక్రియను ప్రత్యేక బృందాలు పూర్తి చేశాయి. జిల్లావ్యాప్తంగా జీవో 59 కింద 38,43,899 చదరపు గజాల విస్తీర్ణానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు 13,229 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 3866 వచ్చాయి.
మరోవైపు 32 బృందాలు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నారు. అత్యధికంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 14 బృందాలు దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. ప్రభుత్వం జూన్ 2, 2014లోగా ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను మాత్రమే క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో 250 గజాలలోపు ఇల్లు నిర్మించుకున్నట్లయితే 25 శాతం కనీస ధరను, 251-500 గజాల్లో అయితే 50 శాతం, 500-1000 గజాల్లో ఇల్లు నిర్మించుకున్నట్లయితే 75 శాతం కనీస ధరను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 1000 చదరపు గజాలపై ఉన్నట్లయితే సంబంధిత వివరాలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. శేరిలింగంపల్లి మండలంలో భూముల విలువ అధికంగా ఉంటుంది కాబట్టి పరిశీలన ప్రక్రియ ప్రభుత్వస్థాయిలో జరుగనున్నట్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగం వెల్లడించింది.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23 : ఇండ్ల క్రమబద్ధీకరణ సర్వే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల మండలాల్లో 265 మంది ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నవారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రభుత్వం రంగారెడ్డిజిల్లా మైనింగ్ అధికారి ప్రవీణ్రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన నేతృత్వంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులోభాగంగా ప్రవీణ్రెడ్డి శుక్రవారం మంచాల మండలంలోని పలు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఎన్నో ఏండ్లుగా సొంతింటి కల నెరవేర్చుకోవాలని చూస్తున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. క్రమబద్ధీకరణ కార్యక్రమం త్వరలోనే పూర్తవుతుందన్నారు.