షాద్నగర్, సెప్టెంబర్ 23 : అర్హులందరికీ ఆసరా పథకం వర్తిస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట, మొగిలిగిద్ద, చించోడు, చౌలపల్లి, కంసాన్పల్లి గ్రామాల్లో ఆసరా పింఛన్ల కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకం అందని కుటుంబం అంటూ లేదని, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చిందన్నారు. పేద ప్రజల కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మనమందరం అండగా ఉండాలని కోరారు. అనంతరం మొగిలిగిద్దలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థుల వసతుల గురించి ఆరా తీశారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎలికట్ట గ్రామానికి చెందిన శ్రీనుకు రూ. 60 వేలు, మొగిలిగిద్ద గ్రామానికి చెందిన సాలమ్మకు రూ. 18 వేలు, కంసాన్పల్లి గ్రామానికి చెందిన రహీమాబీకు రూ. 30 వేలు, పవన్కుమార్కు రూ. 17 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో వినయ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.