ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ దవాఖానలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్స్, నర్సింగ్హోంలు, కన్సల్టేషన్ రూంలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ఫిజియోథెరపీ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. తనిఖీల కోసం జిల్లాలో 12 బృందాలు రంగంలోకి దిగాయి. దవాఖానలకు అన్ని రకాల అనుమతులున్నాయా.. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నారా.. లేదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని తనిఖీలు చేయనున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే సదరు దవాఖానల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. అవసరమైతే సీజ్ కూడా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 22, (నమస్తే తెలంగాణ): జిల్లాలో అనుమతిలేని ప్రైవేట్ దవాఖానలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్టేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రైవేట్ దవాఖానలు పేద ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినా, ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న దవాఖానలపై చర్యలు తీసుకోనున్నారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ తనిఖీలు చేపట్టనున్నారు. తనిఖీలు చేసేందుకుగాను ప్రత్యేకంగా బృందాలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.స్వరాజ్యలక్ష్మి ఏర్పాటు చేశారు. ప్రైవేట్ దవాఖానలు, క్లినిక్స్, నర్సింగ్హోంలు, కన్సల్టేషన్ రూంలు, పాలీ క్లినిక్స్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ఫిజియోథెరపీ కేంద్రాలు, డెంటల్ దవాఖానల్లో తనిఖీలు చేపట్టి, సంబంధిత ఆయా దవాఖానలకు అనుమతులున్నాయా లేదా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్నారా లేదనే పూర్తి అంశాలను వైద్యాధికారుల బృందాలు తనిఖీలు చేయనున్నారు. జిల్లాలోని అదనపు డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలతో కూడిన 12 బృందాలను జిల్లా వైద్యారోగ్య శాఖ నియమించింది.
ఐదు రోజులపాటు తనిఖీలు…
జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో నేటి నుంచి ఐదు రోజులపాటు తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత ప్రైవేట్ దవాఖానలకు షోకాజు నోటీసులివ్వడమా లేదంటే సీజ్ చేయడమనేది నిర్ణయించనున్నారు. దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా తనిఖీల్లో భాగంగా పరిశీలించనున్నారు. ప్రధానంగా జిల్లావ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ క్లినిక్స్పై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఎలాంటి అర్హత లేకుండానే ఆర్ఎంపీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రైవేట్ క్లినిక్స్లన్నింటినీ మూసివేయడంతోపాటు ఆర్ఎంపీ వైద్యులపై చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా ఆయా స్కానింగ్ల పేరిట సామాన్య ప్రజానీకం నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న డయాగ్నోస్టిక్ కేంద్రాలపై కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోనున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ కేంద్రాలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. జిల్లావ్యాప్తంగా 2 వేల వరకు ప్రైవేట్ దవాఖానలుండగా, వీటిలో అధికారికంగా 200 ప్రైవేట్ దవాఖానల వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.
నిబంధనలు పాటించని దవాఖానలపై చర్యలు
జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానలపై చర్యలు తీసుకుంటాం. శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని రకాల ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్టేందుకుగాను వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఐదు రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్టి, చర్యలు తీసుకోనున్నాం.
– స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్వో
అధికారి హోదా తనిఖీ చేసే ఏరియా
డా.అరుణ బృందం డీఎల్వో మన్సూరాబాద్, ఎల్బీనగర్
డా.అరుణకుమారి బృందం డీటీసీవో బాలాపూర్
డా.అనిత బృందం పీవోడీటీటీ కర్మన్ఘట్
డా.సృజన బృందం డిప్యూటీ డీఎంహెచ్వో శంషాబాద్, శేరిలింగంపల్లి
డా.దామోదర్ బృందం డిప్యూటీ డీఎంహెచ్వ చేవెళ్ల డివిజన్
డా.గీత బృందం డిప్యూటీ డీఎంహెచ్వో కొత్తపేట్, చైతన్యపురి, దిల్సుఖ్నగర్
డా.నాగజ్యోతి బృందం డిప్యూటీ డీఎంహెచ్వో వనస్థలిపురం, హయత్నగర్
డా.జయలక్ష్మి బృందం డిప్యూటీ డీఎంహెచ్వో షాద్నగర్ డివిజన్
డా.వినోద్ బృందం బీడీకేయూహెచ్సీ మీర్పేట్, బడంగ్పేట్, జిల్లెల్గూడ
డా.సాల్మన్ బృందం ఎన్సీడీ పీవో హస్తినాపురం
డా.జనార్ధన్ బృందం ఎపిడమిక్ బీఎన్రెడ్డి
డా.రాకేష్ బృందం డీఎంవో నార్సింగి