వికారాబాద్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ అట్టహాసంగా షురూ అయ్యింది. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, కలెక్టర్ నిఖిలతో కలిసి మహిళలకు కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ సీఎం కేసీఆర్కు ఆడపడుచులపై ఉన్న ఆప్యాయత, అనురాగానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా, చీరలు అందుకున్న మహిళలు, యువతుల మోముల్లో చిరునవ్వు కనిపించింది. అందరూ ఒక దగ్గరికి చేరి చీరల కలర్లు, డిజైన్లు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. చూడచక్కగా ఉన్నాయంటూ మురిసిపోయారు.
పరిగి, సెప్టెంబర్ 22: బతుకమ్మ పండుగను ఆడపడుచులు సంతోషంగా జరుపుకొవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బతుకమ్మ చీరల ఖరీదు, రంగులు చూడొద్దని, ఒక అన్నలా సీఎం కేసీఆర్ ప్రేమ, అభిమానం చిరు కానుకలో చూసుకోవాలన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గతం లోని ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చిరు కానుకలు ఇవ్వలేదని, బతుకమ్మ చీరల పంపిణీలో సీఎం కేసీఆర్ ఆప్యాయత, అనురాగాలు ఒకవైపు, నేతన్నల కష్టం మరోవైపు ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 2017 నుంచి ఇప్పటివరకు సుమారు 5.81 కోట్ల చీరలను ఆడపడుచులకు ప్రభుత్వం ఐదు దఫాలుగా అందజేసిందని.. ఇందుకోసం రూ.1,802 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
ఈసారి 24 డిజైన్లు, పది రకాల ఆకర్షణీయమైన రంగుల్లో 240 రకాల దారపు పోగుల అంచులతో చీరలు తయారు చేయించ డం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేతన్నలకు చేయూత ఇవ్వడంతోపాటు ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న గొప్ప లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. సిరిసిల్లలో 16 వేల మంది నేతన్నలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరల ప్రాజెక్టుకోసం ప్ర భుత్వం రూ.339.73కోట్లు ఖర్చు చేసిందన్నారు. వికారాబాద్ జిల్లాలో 2,88,000 మంది ఆడప డుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.
ఆడపడుచులు సం బురంగా పండుగను జరుపుకోవాలన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడు తూ అన్ని వర్గాల వారు కలిసి మెలిసి బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకొంటారన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మ పం డుగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రభు త్వం ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లోని మహిళలకు చీరలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు మంత్రి సబితారెడ్డి బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీఆర్డీవో కృష్ణన్, ఇన్చార్జి డీఆర్వో అశోక్కుమార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మహిళలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సల్లగుండాలి
తెలంగాణ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ సల్లగుండాలి. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. అన్ని గ్రామా ల్లోని మహిళలకు రంగురంగుల బతుకమ్మ చీరలు ఇవ్వడం గొప్ప విషయం.
-పద్మమ్మ, నస్కల్ గ్రామం, పరిగి మండలం
అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధా న్యత ఇస్తున్నది. తెలంగాణలో పెద్ద పండుగైన బతుకమ్మ వేడుకలను ప్రభుత్వమే నిర్వహించడంతోపాటు ఆడబిడ్డలకు సారె పెట్టడం ద్వారా పేదల ఇండ్లలో సీఎం కేసీఆర్ సంతోషాన్ని నింపుతున్నారు.
-లావణ్య, రుక్కుంపల్లి గ్రామం, పరిగి మండలం
చాలా సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఎప్పుడు కూడా ఇలాంటి కానుకలను అందించలేదు. ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తూ సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారు. కానుకలు అందిస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-కళావతి, నస్కల్ గ్రామం, పరిగి మండలం