యాచారం, ఫిబ్రవరి 3 : మండల కేంద్రంలోని హజ్రత్ సయ్యద్ అబ్బాస్షా దర్గా షరీఫ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఉత్సవాలకు అబ్బాస్షా దర్గా ముస్తాబైంది. దర్గాకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో ఎంతో సుందరంగా నిర్వాహకులు అలంకరించారు. సాగర్ రహదారి పక్కనే ఉన్న దర్గా రాత్రిపూట విద్యుత్ కాంతులీనుతున్నది. ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. హిందువులు, ముస్లింలు కులమతాలకు అతీతంగా ఐక్యతతో దర్గాను దర్శించుకుంటారు.
4వ తేదీన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గ్రామ ప్రధాన వీధుల్లో డప్పు చప్పుళ్ల మధ్య సందళ(గంధం) ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలో సమర్పిస్తారు. అనంతరం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మండల కేంద్రంతో పాటుగా ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఉత్సవాలకు హాజరు కానున్న ఎమ్మెల్యే కిషన్రెడ్డి 5వ తేదీ రోజున దర్గా వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో తినుబండారాలు, చిన్న పిల్లల ఆటవస్తువుల దుకాణాలు వెలుస్తాయి. ఉత్సవాలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మండల కేంద్రంలో రెండు రోజులపాటు నిర్వహించే హజ్రత్ సయ్యద్ అబ్బాస్షా దర్గా షరీఫ్ ఉత్సవాలకు కుల, మత, రాజకీయాలకు అతీతంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకొని విజయవంతం చేయాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులను కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. మండలంలోని అన్ని గ్రామాల నుంచి భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొనాలని కోరుతున్నాం.
– మహ్మద్ గౌస్, వార్డు సభ్యుడు యాచారం