ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకుండా చెరువుల్లోకి చేరింది. ఎన్నో ఏండ్లుగా నిండని చెరువులు సైతం మత్తడి దుంకాయి. జిల్లాలో 22,00లకు పైగా చెరువులు, కుంటలు ఉండగా, ఇందులో 80 శాతానికిపైగా మత్తడి దుంకుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో పైపైనే నీళ్లు ఉన్నాయి. సాగునీటికి ఢోకాలేదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5 : రంగారెడ్డి జిల్లాలో జలకళ ఉట్టిపడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడు లేని విధంగా అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. జిల్లాలో 22,00లకుపైగా చెరువులు, కుంటలు చెక్డ్యాంలు ఉన్నాయి. వీటిలో 80శాతానికి పైగా నిండి మత్తడి దుంకుతున్నాయి. పదేండ్లుగా నిండని చెరువులు, కుంటలు సైతం నిండుకుండలా మారాయి. ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సత్ఫలితాలిస్తున్న మిషన్ కాకతీయ పనులు..
మిషన్కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలు, ఆయకట్టు కాల్వల మరమ్మతుకు రాష్ట్ర సర్కార్ అధిక నిధులు కేటాయించింది. ఇరిగేషన్ అధికారులు చెరువులు, కుంటల మరమ్మతుతో పాటు పెద్ద ఎత్తున చెక్డ్యాంలను నిర్మించారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. జిల్లాలో గతంలో సుమారు రూ.250 కోట్లతో చెరువులు, కుంటలు, సాగు నీరందించే కాల్వలకు మరమ్మతులు చేయించారు. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం డివిజన్లోని పెద్దకాల్వ మరమ్మతుకు ప్రభుత్వం రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో మండలంలోని ఎగువప్రాంతమైన ఎలిమినేడు, పోచారం, ఉప్పరిగూడ, మాలగూడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే పెద్దవాగును పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టారు. ఈ వాగులో మధ్యలో చెక్డ్యాంల నిర్మాణం కూడా చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల మాదాపూర్, ఆకులమైలారం, గుమ్మడవెల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి చేరింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు ప్రధానంగా నీరందించే మరోకాల్వ రాచకాల్వ.. ఈ కాల్వ మరమ్మతుకూ సుమారు రూ.1.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో గండ్ల మరమ్మతు, చెట్లు, చెత్తాచెదారాన్ని తొలిగిచారు. జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, రాజేంద్రనగర్, షాద్నగర్, మహేశ్వరం తదితర మండలాల్లో ఉన్న చెరువులు, కుంటల మరమ్మతు పనులు చేపట్టారు.
మూడు విడుతలుగా మరమ్మతులు..
మిషన్ కాకతీయ కింద విడుదలైన నిధులతో జల్లాలో 22,00 మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులుండగా, మొదటి విడుతలో 312, రెండో విడుతలో 410, మూడో విడుతలో మిగిలిన చెరువుల మరమ్మతులు చేపట్టారు.
ప్రతి డివిజన్కు మిషన్కాకతీయ నిధులు..
జిల్లావ్యాప్తంగా ఉన్న ఇబ్రహీంపట్నం, శంషాబాద్, అబ్దుల్లాపూర్మెట్, షాద్నగర్, చేవెళ్ల, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, మంచాల తదితర డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల పరిధిలో చెరువులు, కుంటల శాశ్వత మరమ్మతు కోసం మిషన్కాకతీయ కింద ప్రభుత్వం నిధులు కేటాయించింది. మరమ్మతులు చేయడంతో సత్ఫలితాలు వచ్చాయి. చెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వలకు గండ్లు పడినందున వర్షపునీరు చెరువులోకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. కాల్వల మరమ్మతుతో పాటు తూములు, అలుగుల మరమ్మతు పనులు కూడా చేపట్టారు. దీంతో వర్షపు నీరు వృథాగా పోకుండా చెరువులు, కుంటల్లో చేరింది.
ఆనందంలో ఆయకట్టు రైతులు..
జిల్లాలోని పలు చెరువులు, కుంటల కింద సుమారు 50వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నది. పుష్కలంగా సాగు నీరు ఉండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కింద సుమారు 12,500 హెక్టార్ల ఆయకట్టు భూములు ఉన్నాయి. రెండు పంటలకు సరిపడా సాగునీరు అందనున్నది. జిల్లాలోని రావిర్యాల పెద్దచెరువు, షాబాద్ పహిల్వాన్ చెరువు, యాచారం లక్ష్మణ్చెరువు వంటి పెద్దచెరువులు నిండడం వల్ల ఆయకట్టు ప్రాంతాలు సాగుకు నోచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇబ్రహీంపట్నం డివిజన్లోనే 210 చెరువులు..
జిల్లాలోని ఇబ్రహీంపట్నం డివిజన్లో అత్యధికంగా 210కి పైగా చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల కింద అత్యధికంగా 3వేలకు పైగా ఆయకట్టు ప్రాంతాలున్నాయి. ఈ సీజన్ నుంచే వరిసాగుకు నీరు విడిచే అవకాశాలున్నాయని రైతులు భావిస్తున్నారు. దీనికి తోడు భూగర్భ జలాలు సైతం పెరుగడంతో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉన్నది.
సత్ఫలితాలిచ్చిన మిషన్కాకతీయ..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్కాకతీయ పథకం సత్ఫలితాలను ఇచ్చింది. చెరువులు, కుంటలు, ప్రధాన కాల్వల మరమ్మతుతో వర్షపు నీరు వృథా కాలేదు. దాదాపుగా జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
ఎటుచూసినా పుష్కలంగా నీరు..
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. మిషన్కాకతీయ వల్ల చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరుగడంతో జిల్లాలో ఎటుచూసినా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రైతులంతా వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు.
– రవణమోని జంగయ్యముదిరాజ్