రంగారెడ్డి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ‘మిషన్ కాకతీయ’తో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. పూడిక తీత, తూముల మరమ్మతులతో పాటు గండ్లు, బుంగలు పడకుండా చెరువుల కట్టలను పటిష్టంగా పునర్నిర్మించారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో రంగారెడ్డి జిల్లాలోని 794 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లోకి పుష్కలంగా నీరు వచ్చింది. చెరువులు, కుంటల కింది ఆయకట్టు భూములకు సరిపడా సాగునీరు అందుతున్నది. బంగారు పంటలు పండుతుండడంతో అన్నదాత మోములో ఆనందం వెల్లి విరుస్తున్నది. ఇదివరకు జిల్లాలో 45 నుంచి 52 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేది. ప్రస్తుతం లక్షా 22 వేల ఎకరాలకు పైగా సాగైనట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ‘మిషన్ కాకతీయ’తో సాగు విస్తీర్ణం రెట్టింపు కావడం గమనార్హం.
ఎండిపోయిన బావులు, నెర్రెలుబారిన చెరువులు, కుంటలు, కళ తప్పిన జలాశయాలు, బీైళ్లెన భూములతో తాగునీటికి సైతం నకనకలాడుతుండేది తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, కాలువలు, జలాశయాలన్నీ నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ (మన ఊరు-మన చెరువు) కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రమంతటా దాదాపు 46 వేల చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 792 చెరువులను ‘మిషన్ కాకతీయ’ ద్వారా పునరుద్ధరించుకోగలిగాం. జలాశయాల నిండుగా నీటిని ఒడిసి పట్టుకున్నాం. తద్వారా బీడు భూములను తడుపుకోగలుగుతున్నాం. ఒక్కో రైతు వానకాలం తనకున్న భూమిని సాగు చేసుకోగలిగేవాడు. కానీ, యాసంగి వచ్చేసరికి ఉన్న దాంట్లో సగం భూమినే సాగు చేస్తున్నాడు. ‘మిషన్ కాకతీయ’ పుణ్యమా అని చెరువులు, కుంటలు, కాలువలు, పలు జలాశయాల్లో జలకళ సంతరించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి వర్షాలు సైతం అధికంగా కురుస్తున్నాయి.
సీఎం కేసీఆర్ చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలు ‘మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం’లకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒక్క రాజేంద్రనగర్ మండలంలోనే సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. దీని ద్వారా భూగర్భ జలాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. యాసంగి సీజన్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది. 2015లో ప్రారంభమైన ‘మిషన్ కాకతీయ’ ఇప్పటికీ కొనసాగుతున్నది. జిల్లాలో చెరువులు, కుంటలు, కాలువల ఆధునీకరణ, తూముల మరమ్మతు తదితర పనులు ఇప్పటికే చేశారు. ఇంకా పలు చెరువులకు మరమ్మతులు, పూడిక తీత పనులు కొనసాగుతున్నాయి. నాలుగు విడుతలుగా పనులు చేపట్టడం జరిగింది. అయితే, ఈ ‘మిషన్ కాయతీయ’ ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు అందుతున్నాయి.
దీనిద్వారా చెరువుల కింద ఆయకట్టు 40 నుంచి 80 శాతానికి పెరిగినట్లు జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 792 చెరువులకుపైనే ఉన్నాయి. వీటి ద్వారా ఒకప్పుడు జిల్లాలో 45 నుంచి 52 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. ప్రస్తుతం పరిస్థితి మారి, చెరువుల పునరుద్ధరణతో లక్షా 22 వేల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం రెట్టింపు అయినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగవుతుండటం ‘మిషన్ కాకతీయ’ సత్ఫలితాలకు నిదర్శనం. జిల్లాలోని పలు చెరువులు, జలాశయాల కింద ఆయకట్టు భారీ స్థాయిలో పెరిగింది. పలు చెరువులు, కుంటల్లో తీసిన పూడికను తమ పంట భూముల్లో పోసుకున్న రైతులకు పెద్ద ఎత్తున దిగుబడి వస్తున్నట్లు తెలుస్తున్నది.
గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన వనరులు…
గత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతంలోని జల వనరులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. కాగా, నీటి వనరులు పూర్తి స్థాయిలో దెబ్బ తిన్నాయి. వర్షం నీటిని ఒడిసి పట్టే ప్రణాళికలు లేక పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నీరంతా వృథాగా పోయేది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ చెరువుల్లోకి వరద నీటిని పంపించే పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యూహంతో తీసుకొచ్చిన ‘మిషన్ కాకతీయ’తో అనేక చెరువులకు సరికొత్త జీవకళ సంతరించుకున్నది పూడికతీత, మరమ్మతులతో ప్రస్తుతం ఏ చెరువును చూసినా నీటితో తొణికిసలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆయా జలాశయాల ద్వారా జిల్లాలో యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా అందుతున్నది. దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట సాగుకు నీటికి ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు.
జలకళ సంతరించుకున్న చెరువులు…
దశాబ్దాలుగా దేని కోసమైతే తెలంగాణ ప్రజలు గోస పడ్డారో.. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ మదిలో పదిలపర్చుకొని, ఆయా సమస్యలకు పరిష్కారం చూపేలా ‘మిషన్ కాకతీయ’ను అమలు చేశారు. తద్వారా చెరువులు, కుంటలు, జలాశయాలను బాగు చేసుకోవడం ఒక్కటే కాదు, వర్షం నీటిని నిల్వ చేసుకొని పంటలకు సాగు నీరు అందించడమే ప్రధానమైన ధ్యేయం. జిల్లాలోని వందలాది చెరువుల్లో పూడికతీత తొలగించడం ద్వారా చెరువుల సామర్థ్యం పెరిగింది. జలకళ సంతరించుకోవడంతో చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో భారీ వర్షాలు కురిసిన సందర్భంలో ఎక్కడో ఓ చోట చెరువులకు గండ్లు, బుంగలు పడి నీరంతా పోయేది. ప్రస్తుతం, చెరువు కట్టలను బలోపేతం చేయడంతో చెక్కు చెదరకుండా చెరువు కట్టలు దిట్టంగా దర్శనమిస్తున్నాయి. పలుమార్లు లీకేజీలతో కొట్టుమిట్టాడిన తూములకు మరమ్మతులు చేయడంతో ఇబ్బందులు తొలగిపోయాయి. పలు జలాశయాల చుట్టూ భూగర్భ జలాలు అధికంగా పెరిగాయి.
మిషన్ కాకతీయ.. అద్భుత కార్యక్రమం
చెరువుల పునరుద్ధరణలో ‘మిషన్ కాకతీయ’ ఒక అద్భుత కార్యక్రమం. దీని ద్వారా సత్ఫలితాలు అందుతున్నాయి. సాగుకు లభ్యం కాక గత పాలకుల హయాంలో రైతులు ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికతో ముందడుగు వేసి ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించారు. వందలాది చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. రైతుల గోసకు పరిష్కారం చూపుతున్నారు. గతంతో పోలిస్తే తెలంగాణలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. జలాశయాల నిండా నీటి నిల్వలు ఉన్నాయి. భూగర్భ జలాలు సైతం అమితంగా పెరిగాయి.
– సుజాత, ఇరిగేషన్ డీఈఈ, రంగారెడ్డి జిల్లా
పలు రకాల పంటలకు అనుకూలం…
జిల్లాలో యాసంగి సీజన్లో ప్రధానంగా 16 రకాల పంటలు పండిస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు యాసంగిలో పలు రకాల పంటలు పండించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కాదు. ప్రధానంగా నీటి కొరత అధికంగా ఉండేది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ‘మిషన్ కాకతీయ’ను ఆచరణలోకి తీసుకురావడంతో సత్ఫలితాలు అందుతున్నాయి. ప్రస్తుతం రైతులకు భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో 45 వేల నుంచి 52 వేల ఎకరాల్లో పంటలు పండించేవారు. ప్రస్తుతం ఆయా పంటల సాగు రెండింతలు అయ్యింది. ఇదంతా ఒక్క ‘మిషన్ కాకతీయ’ పుణ్యమే.
– గీతారెడ్డి, వ్యవసాయాధికారి, రంగారెడ్డి జిల్లా