స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పట్టణ, పల్లెల్లో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులతో పాటు వరి నాట్లేసే రైతులు ఇలా ప్రతి పౌరుడూ ఎక్కడివారు అక్కడే ఉదయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.
వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి
పరిగి, ఆగస్టు 16 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఇంటికీ ఉచితంగా జాతీయ జెండాను అందజేసి జాతీయత ఐక్యతను సీఎం కేసీఆర్ చాటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒకేసారి జనగణమన గీతాన్ని ఆలపించి జాతీయ ఐక్యతను చాటారని అన్నారు. ఈ నెల 22 వరకు నిర్వహించే వజ్రోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అధికారులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, ఐజి కమలహాసన్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, లైబ్రరీ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, ఎస్పీ కోటిరెడ్డి, డీఈవో రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.
షాద్నగర్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు