రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీపై బదిలీ వేటు పడింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదివారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే బదిలీ ఉత్తర్వులు వెలువడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పొట్రుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రెండున్నర నెలల వ్యవధిలోనే ఇద్దరు కలెక్టర్లపై బదిలీ వేటు పడింది.
– రంగారెడ్డి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : భారతి హోళీకేరీకి బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. అక్టోబర్ 13న ఆమె కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. విధులు నిర్వర్తించిన 73 రోజుల వ్యవధిలోనే ఆమెపై కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పొట్రుకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఆయనపై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ధరణి పోర్టల్లో జరిగిన భారీ భూ కుంభకోణమే ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతున్నది.
కోర్టు కేసులు, పాసు పుస్తకాల్లో డేటా మార్పు, పెండింగ్ మ్యుటేషన్ వంటి దరఖాస్తులు ధరణిలో అక్రమంగా నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో తహసీల్దార్తోపాటు ఇతర అధికారుల విచారణ రిపోర్టులేవీ లేకుండానే దరఖాస్తులకు ఆమోదం లభించినట్లు అక్రమార్కులు ధరణిలో నమోదు చేశారు. జిల్లా నలుమూలల్లో విలువైన భూములకు సంబంధించిన 98 దరఖాస్తులు అక్రమంగా ధరణి పోర్టల్లో ఆమోదం పొందగా.. ఈ అక్రమంలో రూ.కోట్లు చేతులు మారినట్లు సమాచారం. అధికారులంతా అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 11 మధ్యనే ఈ వ్యవహారం నడిచింది. ధరణి కో-ఆర్డినేటర్ నరేశ్, ఆపరేటర్ మహేశ్లను బాధ్యులుగా చేసి వారిపై ఆదిబట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశమవుతున్నది.
రంగారెడ్డి జిల్లాలోని ధరణి పోర్టల్లో అక్రమంగా నమోదు చేసిన 98 దస్ర్తాలకు సంబంధించిన విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే ధరణి కో-ఆర్డినేటర్ నరేశ్, అపరేటర్ మహేశ్లను పోలీసులు అదుపులోకి విచారణ జరిపినప్పటికీ కీలక అంశాలేవీ వెల్లడి కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే 98 దస్ర్తాలు ఎవరికి సంబంధించినవి? ఏ ప్రాంతానికి సంబంధించినవి? తదితర వివరాల కోసం పోలీసులు సీసీఎల్ఏకు లేఖ రాశారు. ఆ వివరాల ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరిపేందుకు పోలీసులు నిర్ణయించారు. సీసీఎల్ఏకు పోలీసులు లేఖ రాసి పదిహేను రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు దస్ర్తాలకు సంబంధించిన వివరాలేవీ రాలేదని తెలిసింది.
దీంతో పోలీసుల దర్యాప్తులో జాప్యం జరుగుతున్నది. ఇదే క్రమంలో దర్యాప్తును తొక్కిపెడుతున్నారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల కుంభకోణంపై ఇప్పటివరకు కలెక్టర్ భారతి హోళీకేరీ పత్రికాముఖంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకే జిల్లా కలెక్టరేట్ ఏవో ఫిర్యాదు చేసినప్పటికీ.. కలెక్టర్ మౌనంగా ఉండడం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా కలెక్టర్పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం.. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ధరణి వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనతో ధరణి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక పారదర్శకంగా విచారణ సాగితే ధరణి అక్రమాల డొంక కదలనుంది. ప్రస్తుత పరిస్థితులు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్24: జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా గౌతమ్ పొట్రును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన భారతి హోళీకేరీని సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు ఇవ్వవలసిందిగా ప్రభుత్వం ఆమెను ఆదేశించింది. గౌతమ్ పొట్రు (ఎఫ్ఏసీ) 2015 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. జిల్లాలో సమర్థవంతమైన పాలన అందించేందుకు కృషి చేయనున్నట్లు గౌతమ్ పొట్రు పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన కోరారు.