శంకర్పల్లి ఆగస్టు 19 : నగరానికి కూత వేటు దూరంలో ఉన్న శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. అద్దంలా మెరిసే రోడ్లు, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, స్వచ్ఛ ఆటోలతో చెత్త సేకరణతో గతానికి భిన్నంగా మోకిల గ్రామం మారింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నెలా కేటాయిస్తున్న పల్లె ప్రగతి నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేసి నిత్యం ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
గ్రామంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ల నిర్మాణంతో పల్లె పరిశుభ్రంగా మారింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. గ్రామంలో పల్లె ప్రకృతి వనం చిట్టడవిని తలపిస్తున్నది. గ్రామంలో డంపింగ్యార్డు, కంపోస్ట్ షెడ్డు, ట్రాక్టర్, ట్యాంకర్, హరితహారం, నర్సరీ, వైకుంఠధామం వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. తడిపొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. నగరానికి కొంచం దూరంలో ఉండి ప్రశాంత వాతావరణం ఉండడంతో చాలా మంది ధనవంతులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు.
సుబిషి, వివంత వంటి పెద్ద పెద్ద నిర్మాణ రంగ సంస్థలు వందల సంఖ్యలో విల్లాలను, బహుళ అంతస్తు భవనాలను నిర్మించి విక్రయిస్తున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండడంతో వినియోగదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మోకిల గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తా. గ్రామంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. సీసీ రోడ్లు, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తా.
– సుమిత్రా మోహన్రెడ్డి, సర్పంచ్
పల్లెలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సహకారంలో గ్రామన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– సబవాత్ సరితా రాజు నాయక్, మోకిల ఎంపీటీసీ