మర్పల్లి, ఆగస్టు 19 : మిషన్ భగీరథతో పల్లెల్లో తాగునీటి కష్టాలు తీరాయి. ఇదివరకు కిలో మీటర్ల దూరంలో వెళ్లి వ్యవసాయ బోరుబావుల వద్ద నీళ్లు తెచ్చుకునేవారు. మండలంలోని పట్లూర్, పట్లూర్ తండా, నర్సాపూర్ పెద్ద తండా, చిన్న తండా, గుర్రంగట్టు తండా, షాపూర్తండాలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఇంటింటికీ నీటి సరఫరా అవుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మర్పల్లి మండలంలోని 27 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో నిత్యం లక్షల లీటర్ల తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా ఐహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, సంపులను నిర్మించారు.
మిషన్ భగీరథతో పట్లూర్ గ్రామంలో తాగునీటి కష్టాలు తీరాయి. ఇదివరకు బోరుబావుల వద్దకు వెళ్లి తెచ్చుకునేవాళ్లు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథతో ఇంట్లోనే నల్లాను బిగించి నీటిని సరఫరా చేస్తున్నాం.
– ఇందిరా అశోక్, పట్లూర్ సర్పంచ్
మిషన్ భగీరథతో నిత్యం సరిపడా ఇంటింటికీ నీళ్లు సరఫరా అవుతున్నాయి. తెలంగాణ రాకముందు తాగునీటికి బోరుబావులు, బోరింగ్ల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండి తెచ్చుకునే కష్టాలు తీరాయి. పల్లెల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– స్వప్న సురేశ్, పట్లూర్ ఎంపీటీసీ