ప్రభుత్వ పాఠశాలకు జేసీఐ సంస్థ చేయూత… రూ. 2.5లక్షలతో మోడల్ టాయిలెట్ల నిర్మాణం …
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
యాచారం, ఆగస్టు 19 : మండలంలోని చింతపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం జేసీఐ (జూనియర్ చాంబర్స్ ఇంటర్నేషనల్) ఉద్యోగుల సంస్థ రూ. 2.5లక్షలతో మోడల్ టాయిలెట్లను నిర్మించడంతో విద్యార్థుల సమస్య తీరింది. చదువు, క్రీడల్లో విద్యార్థులు ప్రత్యేకతను చాటుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పక్కా భవనం, విశాలమైన తరగతి గదులు, క్రీడలకు అనుకూలమైన ప్రాంగణం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తుండడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలి. పాఠశాలలో టాయిలెట్లు నిర్మించడం హర్షణీయం. పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇటీవల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం, బెంచీలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు.
– సాబేర్ ఉపాధ్యాయుడు, చింతపట్ల
పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. టాయిలెట్లు నిర్మించిన జేసీఐ సంస్థకు కృతజ్ఞతలు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు.
– లిక్కి సరితారెడ్డి, సర్పంచ్ చింతపట్ల