స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ చేసిన పోరాటం విద్యార్థులకు తెలిసేలా మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని థియేటర్లలో సినిమాను ప్రదర్శించారు. కలిసి వికారాబాద్ కలెక్టర్, అధికారులు, ఉపాధ్యాయులు గాంధీజీ చలన చిత్రాన్ని వీక్షించారు. స్వాతంత్య్ర సాధనకు గాంధీ అనుసరించిన మార్గాన్ని తెలుసుకుని చలించిపోయారు. సినిమా హాళ్లలో జాతీయ జెండాకు వందనం చేశారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జాతిపిత మహాత్మాగాంధీ చరిత్రకు సంబంధించిన గాంధీ సినిమాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 88 థియేటర్లలో ప్రదర్శించారు. ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన 31,249 మంది విద్యార్థులు, వికారాబాద్ జిల్లాకు చెందిన 4,312 మంది విద్యార్థులు ఈ సినిమాను చూశారు.
వికారాబాద్లోని సినీమాక్స్ థియేటర్లో విద్యార్థులతో కలిసి వికారాబాద్ కలెక్టర్ నిఖిల, డీఈవో రేణుకాదేవి గాంధీ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సినిమాను చూసిన పలువురు అధికారులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని..ఆయన జీవితం భవితకు మార్గదర్శకమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయు లను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, ఆగస్టు 9