రంగారెడ్డి, ఆగస్టు 9, (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రం, గ్రామపంచాయతీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి మండల కేంద్రంలో 750, గ్రామపంచాయతీల్లో 75 మొక్కలను నాటనున్నారు.
ఇందుకుగాను అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించారు. నాటిన మొక్కల సమూహాన్ని ఫ్రీడమ్ పార్కుగా పిలువనున్నారు. మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర ఖాళీ స్థలాల్లో 750 మొక్కలు, గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ స్కూళ్లు, పల్లె ప్రకృతివనాలు తదితరాల్లో 75 మొక్కలు నాటనున్నారు. అలాగే మున్సిపాలిటీ కేంద్రాల్లో 750 మొక్కలు, వార్డుల్లో 75 మొక్కలను నాటనున్నారు.
పూలు, పండ్ల మొక్కలతోపాటు టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం మొక్కలను నాటనున్నారు. వనమహోత్సవ కార్యక్రమాన్ని నేడు మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనుండగా, మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటనున్నారు.
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లావ్యాప్తంగా 84,890 మొక్కలను నాటనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం గడికోటలో మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో 150, షాద్నగర్ నియోజకవర్గం అన్నారం గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో 750, చేవెళ్ల నియోజకవర్గం ముడిమ్యాల గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో 750, కల్వకుర్తి నియోజకవర్గం ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో 750, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చర్లపటేల్గూడ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో 500, రాజేంద్రనగర్ నియోజకవర్గం మల్కారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఆధ్వర్యంలో 750 మొక్కలను నాటనున్నారు.