వికారాబాద్ సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 14న సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా కలెక్టరేట్, పార్టీ కార్యాలయ ప్రారంభం, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పి.నరేందర్రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ నిఖిలతో కలిసి నూతన కలెక్టరేట్ను సందర్శించారు. అంతేకాకుండా హెలీప్యాడ్ ఏర్పాటు పనులను పరిశీలించి సూచనలు చేశారు.
పరిగి, ఆగస్టు 9 : వికారాబాద్లో నిర్మాణం చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయమైంది. రూ.60.70కోట్లు వెచ్చించి వికారాబాద్లో సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన భవనం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఈ మేరకు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంగళవారం విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పి.నరేందర్రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ నిఖిలతో కలిసి నూతన కలెక్టరేట్ను సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ పక్కనే గల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటుకు పరిశీలించారు. బ్లాక్గ్రౌండ్లో ప్రత్యేకంగా హెలిప్యాడ్తోపాటు కలెక్టరేట్ వెనకాల మరో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ బ్లాక్గ్రౌండ్లో ఏర్పాటు చేసే హెలిప్యాడ్కు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకొని ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్కు చేరుకొని సమీకృత జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన తర్వాత కలెక్టరేట్ భవనం పక్కనే గల స్థలంలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో మార్పులు సైతం ఉండే అవకాశం ఉన్నది.