‘అన్నదాతల శ్రేయస్సే రాష్ట్ర సర్కారు లక్ష్యం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తాం..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ను, పలు గ్రామాల్లో రైతువేదికలను ప్రారంభించగా, కొత్త బ్రాహ్మణపల్లి, కలకొండలలో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తలకొండపల్లి (మాడ్గుల), జూలై31: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మాడ్గుల మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి పాల్గొన్నారు. కొత్త బ్రాహ్మణపల్లి, కలకొండ, అందుగుల గ్రామాల్లో రూ.7.50కోట్లతో 33-11కేవీ సబ్ స్టేషన్లు, రైతువేదికలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు కల్పిస్తే బంగారం పండించే సత్తా మన రైతులకు ఉందన్నారు. రైతులు గతంలో అప్పుకోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడిసాయం, ఉచితంగా 24గంటల విద్యుత్, రైతు బీమా సౌకర్యం కల్పిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చిందన్నారు. రైతు బీమా కోసం ఏటా కోట్ల రూపాయల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదన్నారు.
మీటర్లు పెట్టకుండా రైతుల పక్షాన నిలబడిన మంచి మనస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రైతు లు పండించిన ధాన్యాన్ని కొనలేని కేంద్రం రైతులకు మేలు చేస్తుందంటే ఎలా నమ్మాలన్నారు. రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా చేశారని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, పండించిన పంటలకు మద్దతుధర, సాగునీరు ఇస్తే రాజులా బతుకుతారన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. అన్నదాతల మేలు కోసమే మఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.
పాలమూరు-రంగారెడ్డితో ఎన్నో ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లతో పాటు 450 పథకాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీపీ పద్మారెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్నాయక్, సర్పంచ్లు జయలక్ష్మి, బాల్రెడ్డి, రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు రవితేజ, ఎంపీటీసీలు సౌమ్యరెడ్డి, గోపి, పీఎసీఎస్ చైర్మన్ తిరుమలరెడ్డి, ఉపసర్పంచ్ తుమ్మ శౌరిలు, నేతలు కృష్ణారెడ్డి, జంగయ్యగౌడ్, కొండల్రెడ్డి, వెంకటయ్య, పట్టాభి రామిరెడ్డి పాల్గొన్నారు.