ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు.. ఉన్నత స్థాయికి ఎదిగారు. తమిళనాడు రాష్ట్రంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం డీఐజీ హోదాలో ఉన్నారు. ఆయనే చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్ అబినపు. తమిళనాడు సీఎం మెడల్తో పాటు మరిన్ని అభినందన, ప్రశంస పత్రాలు అందుకున్నారు.. ఆయన గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
చేర్యాల, జూలై 2: చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన దంపతులు అబినపు వీరమణి-మల్లయ్యకు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. మల్లన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి కాగా, వీరమణి ఇంటి వద్దే ఉంటూ చిన్నారులకు ఫ్రీగా చదువు నేర్పించేవారు. వీరి చిన్నకొడుకు ప్రవీణ్కుమార్ గ్రామంలో ఉన్న సర్కారు బడిలో 1 నుంచి 5వ తరగతి వరకు గవర్నమెంట్ ప్రైమరీ స్కూలులో, 6,7 తరగతులు జడ్పీఎస్ఎస్ నాగపురిలో విద్యను అభ్యసించారు. అనంతరం ఏపీఆర్ఎస్ బండారుపల్లిలో 8, 9, 10 తరగతి చదువుకున్నారు. నాటి రోజుల్లో 10వ తరగతిలో 550 మార్కులు(టోటల్) ఉన్న సమయంలోనే 537 సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించారు.
అనంతరం హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్లోని సెయింట్ థామస్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసి, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(అనంతపురం)లో బీటెక్ సైతం పూర్తి చేశారు. ఇదే సమయంలో సివిల్స్ పరీక్షలకు హాజరుకావడంతో ప్రవీణ్కుమార్ 2004లో ఐఆర్ఎస్(ఇన్కమ్ టాక్స్), 2005లో ఐపీఎస్కు సెలక్ట్ అయ్యారు. అనంతరం ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకొని 2006లో ఉద్యోగంలో చేరారు. చెన్నై రాష్ట్రంలో విరుధాచలం, ముత్తుపేట, తీనికాంకుండ్రం సబ్ డివిజన్లలో ఏఎస్పీగా విధులు నిర్వహించారు.
అనంతరం ఎస్పీగా తిరువూరి, కరూర్, తేణి జిల్లాలో విధులు నిర్వహించడంతో పాటు గవర్నర్కు రక్షణ బాధ్యతలు చూసే ఏడీసీగా, సీబీసీఐడీ ఎస్పీగా సైతం పని చేశారు. ప్రవీణ్కుమార్ 2019లో ఎస్పీ నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా తిరునల్వెల్ రెంజ్కు పదోన్నతి లభించింది. ప్రస్తుతం ప్రవీణ్కుమార్ సేలం రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రవీణ్కుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి మెడల్తోపాటు మరిన్ని అభినందన, ప్రశంస పత్రాలు అందుకున్నారు. గ్రామీణ నేపథ్యం కలిగిన ఉన్న ప్రవీణ్కుమార్ విద్యావంతురాలైన తల్లి వీరమణి స్వతహాగా ఏర్పాటు చేసిన బడిలో చదువు ప్రారంభించారు. అమ్మ ఒడి, గ్రామ బడిలో చదువుకుంటున్న సమయంలోనే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడంతో నేడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు.
విద్యార్థులు ఆత్మవిశ్వాసం, ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి. అప్పుడే వారు అనుకున్నది సాధించవచ్చు. ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకున్న సమయంలో విద్యార్థులు తాను మారుమూల పల్లెలో ఉన్నానని, తనకు ఎవరు తెలియదనే, ఏమి రాదనే సంశయాలు, అనుమానాలు పెట్టుకోవద్దు. అనవసరపు ఆలోచనలు పెట్టుకుంటే జీవితంలో ఏం సాధించ లేరు. లక్ష్య సాధన కోసం కఠోరంగా శ్రమించాలి. శ్రమించడంలో విఫలమైతే లక్ష్య సాధన దూరమవుతుంది. ఏకాగ్రతతో కూడిన శ్రమ తప్పక లక్ష్యాన్ని చేరుకుంటుంది. సమయం ఎంతో అమూల్యమైంది. దానిని వినియోగించుకోవాలి.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే మొదటగా వారి మాటలు ఇతరులతో కలిసిపోయే విధంగా ఉండాలి. వారి మనస్సు నొప్పించేలా మాట్లాడితే వారు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం సాధించే విషయంలో, వారి పిల్లలు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. టీవీలు, మొబైల్ ఫోన్లు వదిలి పెడితే తప్పక విజయం సాధించవచ్చు. అమూల్యమైన సమయాన్ని యువత వృథా చేయడం సరికాదు.
– ప్రవీణ్కుమార్ అబినపు, డీఐజీ, చెన్సై