పటాన్చెరు, జూలై 2 : ప్రతి గ్రామపంచాయతీ పచ్చదనంతో కళకళలాడాలని జిల్లా అధికారుల బృందం కోరింది. శనివారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంఎన్ఆర్ఈజీఎస్పై జరిగిన సమీక్షకు డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్మోహన్ హాజరయ్యారు. పటాన్చెరు, జిన్నారం, అమీన్పూర్, హత్నూర మండలాల ఎంపీడీవోలు, కార్యదర్శులతో మాట్లాడారు. వర్షాకాలం లక్ష్యంగా పెట్టుకున్న మొక్కలను నాటాలని సూచించారు.
పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేయాలని, పారిశుధ్యం అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను ఖాళీ స్థలాల్లో నాటి సంరక్షించాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడాస్థలాలను సంరక్షించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి హామీలో పనులను చేపట్టాలని సూచించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నియంత్రించాలని ఆదేశించారు.
గ్రామాల్లో చెత్త సేకరణను పకడ్బందీగా చేపట్టి, డంపింగ్ యార్డ్లకు తరలించాలని సూచించారు. వర్షాకాలం అంటువ్యాధులు విస్తరించకుండా అధికా రులు అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య పనులు చేయించాలన్నారు. ప్రతి గ్రామం అన్ని అంశాల్లో అదర్శంగా కనిపించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలను సంరక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీడీవో బన్సీలాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.