షాద్నగర్టౌన్, జూలై 1: గతంలో రైతులు పంటలు సాగు చేసేందుకు ఎన్నో కష్టాలు పడేవారు. అప్పు చేసి మరి పంటలను సాగు చేసినా వ్యవసాయంలోని మెళకువలు చెప్పేవారు లేరు. ఏ పంట ఎప్పుడు సాగు చేస్తే లాభాలు వస్తాయో వివరించే వారు లేరు. కష్టపడి సాగు చేసినా పంట దిగుబడి సరిగారాక, చేసిన అప్పు తీర్చలేక నానా అవస్థలు పడేవారు. ఈ సమస్యల పరిష్కారానికి అన్నదాతల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది.
రైతును రారాజుగా చేసే విధంగా రైతు బంధు సాయం చేయడంతో పాటు రైతు బీమా ప్రవేశపెట్టి రైతుల కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుండడంతోపాటు పెద్దపీట వేసి ఆదుకుంటున్నారు. రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా తక్షణం పరిష్కరించే విధంగా, సూచనలు, సలహాలు చేసేలా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదిక భవనాల ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించారు. దీంతో ఆయా మండలాల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సంక్షేమ కోసం సర్కార్ ఫరూఖ్నగర్ మండలంలో మొత్తం 5రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేసింది. మండలంలోని ఎలికట్ట, చించోడ్, మధురాపూర్, బూర్గుల, వెల్జర్ల గ్రామాల్లో ఒక్కొక్క రైతు వేదిక భవన నిర్మాణానికి రూ. 22లక్షలను వెచ్చించింది. ఈ రైతు వేదికల్లో వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలను అధికారులు రైతులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం ప్రత్యేక సమావేశాలను నిర్వహించి సూచనలు చేస్తున్నారు. పంటల సాగుపై రైతులకు క్లుప్తంగా సర్కార్ చర్యలు తీసుకున్నది. దీంతో రైతుల్లో పంటల సాగుపై పూర్తి అవగాహన నెలకొంది. దీంతో లాభాల బాటలో రైతులు పయనిస్తున్నారు.
రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు వేదికలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. రైతు వేదికల్లో వ్యవసాయానికి సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఆధునిక వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ పథకాలను రైతులకు వివరిస్తున్నారు. వ్యవసాయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా రైతులు అధికారులతో చర్చించి నివృత్తి చేసుకుంటున్నారు. ఎరువులు, విత్తనాలు సైతం రైతు వేదికల్లో రైతులకు అందిస్తున్నారు. రైతు వేదికల్లో సత్వర సేవలను అందించే విధంగా సర్కార్ చర్యలు చేపడుతున్నది. రైతు వేదికల్లో నియోజకవర్గ వ్యవసాయాధికారి, మండల వ్యవసాయాధికారి, ఏఈవోలు, రైతుబంధు కో-ఆర్డినేటర్లు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలను రైతులకు అందిస్తున్నారు. సాగు సమస్యల పరిష్కారంతో పాటు రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
రైతు వేదికలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. వ్యవసాయ సాగులో రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా అధికారులు రైతు వేదికల ద్వారా సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎలాంటి పంటలను సాగు చేయాలో క్లుప్తంగా వివరిస్తున్నారు. రైతుల సంక్షేమ కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-నరేందర్, రైతు సోలిపూర్ గ్రామం షాద్నగర్
గ్రామాల్లోని రైతుల కోసం తెలంగాణ సర్కార్ రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేసింది. రైతు వేదికల్లో సమావేశాలను నిర్వహించి వ్యవసాయానికి సంబంధించిన సూచనలు, సలహాలను రైతులకు అర్థమయ్యేలా చెబుతున్నాం. పచ్చి రొట్ట ఎరువుల వినియోగం, పంటల సాగుకు సంబంధించిన విత్తనాలను రైతు వేదికల్లోనే రైతులకు అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంటున్నారు. పత్తి విస్తీర్ణాన్ని పెంచే విధంగా కృషి చేస్తున్నాం. వారంలో రెండు సార్లు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం.
-నిశాంత్కుమార్, మండల వ్యవసాయాధికారి, ఫరూఖ్నగర్ మండలం, షాద్నగర్