సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. వ్యవసాయ పనిముట్లను మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆరు మండలాల్లో వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రా (సీహెచ్సీ)లను ఏర్పాటు చేసి మండల సమాఖ్యల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఇంకా మిగిలి మండలాల్లోనూ సీహెచ్సీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొత్తగా తొమ్మిది మండలాలు బంట్వారం, బషీరాబాద్, చౌడాపూర్, కోట్పల్లి, మర్పల్లి, పరిగి, పెద్దేముల్, పూడూరు,
యాలాలలో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సీహెచ్సీల ఏర్పాటుతో రైతులకు మార్కెట్ ధర కంటే పది శాతం తక్కువకే వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇస్తూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. సీహెచ్సీలోని యంత్రాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నది. ఒక్కో సెంటర్కు రూ.15లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించనుండగా.. ఇందులో 25శాతం సబ్సిడీ అందనున్నది. మిగతా 75 శాతంలో 65 శాతం నాబార్డు, స్త్రీ నిధి, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం లభిస్తుంది. మిగిలిన పది శాతాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు చెల్లించాల్సి ఉంటుంది. రైతుల నుంచి ఆదరణ ఉండడంతో సీహెచ్సీలకు మంచి లాభాలు వస్తున్నాయి. గత నెల 28వ తేదీ వరకు వ్యవసాయ పనిముట్ల అద్దెల ద్వారా రూ.6,86,505 లాభా లను ఆర్జించాయి.
పరిగి, జూన్ 30 : ప్రతి మండలంలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్(సీహెచ్సీ) ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లా పరిధిలో కొత్తగా 9 సీహెచ్సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇవ్వడం, మరోవైపు మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించడం లక్ష్యంగా సీహెచ్సీలను ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 19 మండలాలుండగా ఇప్పటివరకు 6 సీహెచ్సీలు ఏర్పాటు చేయగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. యంత్ర పరికరాలు అద్దెకివ్వడం ద్వారా సంబంధిత సీహెచ్సీలు ఆదాయం ఆర్జిస్తున్నాయి. ప్రతి మండలంలో ఒక సీహెచ్సీ ఏర్పాటుతో మార్కెట్లో లభించే యంత్ర పరికరాల కంటే తక్కువ అద్దెకు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.
వికారాబాద్ జిల్లా పరిధిలో కొత్తగా 9 సీహెచ్సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. జిల్లాలో ప్రస్తుతం కులకచర్ల, మోమిన్పేట, తాండూరు, దౌల్తాబాద్, బొంరాస్పేట, ధారూర్లలో సీహెచ్సీలు కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా బంట్వారం, బషీరాబాద్, చౌడాపూర్, కోట్పల్లి, మర్పల్లి, పరిగి, పెద్దేముల్, పూడూరు, యాలాల మండలాల్లో కొత్త సీహెచ్సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. మిగతా నాలుగు మండలాల్లోనూ సీహెచ్సీల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త సీహెచ్సీల ఏర్పాటు తర్వాత ఒక్కో సీహెచ్సీలో రూ.15లక్షల నుంచి రూ.30లక్షలతో యంత్ర పరికరాలను కొనుగోలు చేయనున్నారు.
ఇందులో 25శాతం నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా సబ్సిడీ అందుతుంది. మిగతా 75 శాతంలో 10శాతం మండల సమాఖ్యలు వెచ్చించాలి. 65శాతం నాబార్డు, స్త్రీ నిధి, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొంది యంత్ర పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు పంపించిన మండలాల్లోని నేలల స్వభావం, ఏ పంటలు సాగు చేస్తారు, ఏ యంత్ర పరికరాలు అవసరమవుతాయనేది నివేదిక రూపంలో అందజేశారు. అధునాతన యంత్ర పరికరాలు ఈ మండలాల్లో రైతులకు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఆయా మండలాల రైతులకు మార్కెట్ ధర కంటే 10శాతం తక్కువకు యంత్ర పరికరాలు అద్దెకు లభిస్తాయి.
కొత్త సీహెచ్సీల ఏర్పాటుతో అధునాతన యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్లో ఉన్న ధర కంటే 10 శాతం తక్కువ అద్దెకు లభిస్తాయి. దీంతో వ్యవసాయాభివృద్దికి ఈ సీహెచ్సీలు దోహదం చేస్తాయి. ప్రతి మండలంలో ఇద్దరికి ఉపాధి కూడా లభిస్తుంది. జిల్లాలో ఇప్పటికే 6 సీహెచ్సీలుండగా 9 కొత్త సీహెచ్సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు.
– ఎస్.శ్రీనివాస్, డీపీఎం, వ్యవసాయ జీవనోపాధులు, ఫుడ్ ప్రాసెసింగ్