‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ బడులకు మంచి రోజులొచ్చాయి. మౌలిక వసతులు కల్పిస్తుండటంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధన అమలుచేయడంతో రంగారెడ్డి జిల్లాలోని చాలామంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. మరోవైపు విద్యాశాఖ చేపట్టిన ‘బడిబాట’సత్ఫలితానిచ్చింది. గురువారంతో ఈ కార్యక్రమం ముగియగా.. ఇప్పటివరకు 9,890 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వారిలో ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించి 66 మంది విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల నుంచి 2,787 మంది, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,972 మంది ఉండగా.. నేరుగా ఒకటో తరగతిలో 3,065 మంది విద్యార్థులు చేరారు. రాజేంద్రనగర్, గండిపేట మండలాల్లో వెయ్యికిపైగా విద్యార్థులు సర్కారు స్కూళ్లను ఆశ్రయించారు. ఇప్పటికే సర్కార్ బడుల్లో చదువుతున్న వారికి మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులను ఉచితంగా అందిస్తున్నది.
రంగారెడ్డి, జూన్ 30, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాలతోపాటు ప్రైవేట్ స్కూళ్ల నుంచి భారీగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జిల్లా విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుచేస్తున్న ఆంగ్ల మాధ్యమం, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, బడీడు పిల్లలను చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులకు సంబంధించి ఉపాధ్యాయులు తెలియజేశారు. అంతేకాకుండా బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, ఇంగ్లిష్ మీడియం అమలుపై పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9890 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారు. వీరిలో ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించి 66 మంది విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల నుంచి 2787 మంది, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3972 మంది , ఒకటో తరగతికి 3065 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రైవేట్ స్కూళ్లలో భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంతోపాటు అర్హతలేని ఉపాధ్యాయులుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతుల కల్పన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యనందిస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుండడంతోపాటు ఆంగ్ల బోధనను అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లావ్యాప్తంగా 1309 ప్రభుత్వ పాఠశాలలుండగా, వీటిలో మొదటి విడుతలో 464 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను చేపట్టారు. మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు కూడా ఉచితంగా అందిస్తుండడం, పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత తదితర కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం వంటి కసరత్తును చేస్తున్నారు.
మండలం ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థులు
అబ్దుల్లాపూర్మెట్ 716
ఆమనగల్లు 74
బాలాపూర్ 602
చేవెళ్ల 272
చౌదరిగూడెం 222
ఫరూఖ్నగర్ 417
గండిపేట 1075
హయత్నగర్ 535
ఇబ్రహీంపట్నం 177
కందుకూరు 88
కడ్తాల్ 253
కేశంపేట 231
కందుకూరు 195
కొత్తూరు 323
మాడ్గుల 331
మహేశ్వరం 190
మంచాల 55
మొయినాబాద్ 325
నందిగామ 331
రాజేంద్రనగర్ 1009
సరూర్నగర్ 340
శేరిలింగంపల్లి 742
శంషాబాద్ 633
శంకర్పల్లి 112
షాబాద్ 391
తలకొండపల్లి 177
యాచారం 74
మొత్తం 9890