పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలంటూ భారీ ఎత్తున హడావిడి చేస్తున్న కమలనాథులకు పార్టీ కేడర్ దిమ్మతిరిగే షాక్నిచ్చింది. ఆ పార్టీకి చెందిన నలుగురు గ్రేటర్ కార్పొరేటర్లు, తాండూరు నేతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం గులాబీ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల ముందే ఢిల్లీలో ప్రధాని భేటీలో పాల్గొన్న కార్పొరేటర్లు ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కాషాయ దళం నోట్లో వెలక్కాయ పడింది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలంటూ భారీ ఎత్తున హడావిడి చేస్తున్న కమలనాథులకు పార్టీ క్యాడర్ దిమ్మతిరిగే షాకిచ్చింది. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సాక్షాత్తూ ప్రధాని మొదలు… బీజేపీ జాతీయ, అన్ని రాష్ర్టాల నుంచి నేతలు వస్తున్న తరుణంలో పార్టీకి చెందిన గ్రేటర్ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడం సంచలనం రేకెత్తించింది. అందునా… సమావేశాలు మరికొన్ని గంటల్లో మొదలుకానున్న తరుణంలో నలుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడం బీజేపీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రధానంగా… ఢిల్లీలో ప్రధాని మోదీ బీజేపీ కార్పొరేటర్ల భేటీలో పాల్గొన్న ఈ నలుగురు కార్పొరేటర్లు పార్టీని వీడటంతో తెలంగాణ బీజేపీ నాయకుల పరువు గంగలో కలిసినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్తో సహా మరో ముగ్గురు పార్టీకి చెందిన కార్పొరేటర్లు బీజేపీ గోడ దూకారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం నందినగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్, హస్తినాపురం కార్పొరేటర్ బానోజు సుజాతానాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చనాప్రకాశ్, అడిక్మెట్ కార్పొరేటర్ సునీతాప్రకాశ్గౌడ్ గులాబీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ… ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతూ భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లుగా కార్పొరేటర్లు తెలిపారు.
తలకొండపల్లి, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని మున్సిపల్ ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామరావు అన్నారు. తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లి, మెదక్పల్లి, రాంపూర్ గ్రామాల సర్పంచ్లు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సర్పంచ్లు ధరణీ శివశంకర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, వరలక్ష్మీ రాజేందర్రెడ్డిలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చెర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, భూపతిరెడ్డి, శరత్చంద్ర, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తాండూరు, జూన్ 30: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు సీఎం కేసీఆర్ పరిపాలనను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో తాండూరు మున్సిపల్ బీజీపీ ఫ్లోర్ లీడర్ నరుకుల సింధూజ, సీపీఐ ఫ్లోర్లీడర్స్ ఆసీఫ్, బీజేపీ నాయకుడు నరేందర్గౌడ్ మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీం, టీఆర్ఎస్ నేతలు రాజూగౌడ్, నర్సింహులు ఉన్నారు.