కార్గో బస్సులు అందిస్తున్న సేవలతో టీఎస్ ఆర్టీసీకి కాసుల పంట పండుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని 20 డిపోల్లో కార్గో సేవలు కొనసాగుతుండగా.. అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నది. ప్రభుత్వ సేవలతో పాటు ధాన్యం, కూరగాయల రవాణా, ఇతర వ్యాపారాల సేవలకూ కార్గో బస్సులను వినియోగిస్తున్నారు. పలు సంస్థల నుంచి సరుకులు రవాణా చేసే కాంట్రాక్ట్లను కుదుర్చుకోవటం కోసం టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పలువురు ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా నియమించింది. దీంతో కార్గో బస్సులతో మరిన్ని సేవలను విస్తరించే దిశగా టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది. త్వరలోనే హోం డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. కార్గో బస్సుల్లో సరుకుల రవాణా కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేసింది. ప్రతినెలా ఒక్కో డిపోకు రూ.10 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 24: టీఎస్ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కార్గో సేవల ద్వారా కాసుల పంట పండుతున్నది. ఆర్టీసీ కార్గో ద్వారా మరో అడుగు ముందుకేసింది. అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ బస్సులతో శివారులోని పలు డిపోలకు మంచి ఆదా యం సమకూరుతున్నది. ఇటీవల కార్గో బస్సు ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే పాఠ్యపుస్తకాలను కూడా తరలిస్తున్నారు. అలా గే, ఐకేపీ, డీసీఎంఎస్ తదితర సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని కూడా కార్గో బస్సుల ద్వారా చేరవేస్తున్నారు. విజయ ఆయి ల్ సరఫరాతోపాటు రోహిణి ఫీడ్ను కూడా కార్గో బస్సుల ద్వారానే ఆయా ప్రాంతాలకు చేరవేసే కాంట్రాక్టర్ను ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. కార్గో బస్సుల ద్వారా సంస్థకు ప్రత్యామ్నాయ ఆదాయం వస్తున్నది.
హైదరాబాద్ రీజియన్ పరిధిలో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని 19 డిపోలు, రంగారెడ్డి పరిధిలో ఒక డిపో ఉన్నది. హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఇబ్రహీంపట్నం, హయత్నగర్-1, హయత్నగర్-2, బండ్లగూడ, ఉప్పల్ -1, ఉప్పల్-2, రాజేంద్రనగర్, మహేశ్వరం, మిధానీ, శంషాబాద్, చార్మినార్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర డిపోలుండగా, రంగారెడ్డి రీజియన్ పరిధిలో షాద్నగర్, ఆమనగల్లు డిపోలు ఉన్నాయి. ఈ డిపోలు నగర శివారులో విస్తరించి ఉండటంతో కార్గో బస్సు సేవలను జిల్లా ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి డిపోకు అవసరం మేరకు 2 నుంచి 8 వరకు కార్గో బస్సులను కేటాయించారు. ఆయా డిపోల పరిధిలో కార్గో బస్సు సేవలకు వస్తున్న ఆదరణను బట్టి మరిన్ని కార్గో బస్సులను పెంచాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తున్నది. ప్రయాణికుల చేరవేతతోపాటు సరుకు రవాణాకు ఆర్టీసీ యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది.
2020-21లో టీఎస్ ఆర్టీసీ కార్గో బస్సు పార్సిల్ సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వా రా ప్రతిడిపోకు నెలకు రూ. ఐదు నుంచి రూ. ఆరు లక్షల వరకు ఆదాయం సమకూరుతు న్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోనే ఎనిమిది కార్గో పార్సిల్ బస్సులు నడుస్తున్నా యి. ఈ బస్సుల ద్వారా ప్రతినెలాల డిపోకు రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలకు ప్రజల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తున్నది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో ఎనిమిది కార్గో బస్సుల ద్వారా ప్రజలకు ప్రతిరోజూ సేవలందుతున్నాయి. ఈ కార్గో సేవల ద్వారా డిపోకు ప్రతినెలా రూ.10 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నది. ప్రజలు, వ్యాపారులకు సరుకులను సురక్షితంగా అందజేస్తుండటంతో రోజురోజుకూ ఈ సేవలపై ఆదరణ పెరుగుతున్నది. త్వరలో హోం డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.
-అశోక్రాజు, ఇబ్రహీంపట్నం డీఎం
కార్గో బస్సుల్లో సరుకు రవాణా కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. నగరం నుంచి ప్రతిరోజూ ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల వంటి శివారు ప్రాంతాలకు పెద్దఎత్తున సరుకు రవాణా జరుగుతున్నది. గతంలో ఈ సరుకులను ప్రైవేట్ లేదా వ్యక్తిగత వాహనాల ద్వారా తరలించేవా రు. కానీ, ఆర్టీసీ కార్గో సేవలను ప్రవేశపెట్టిన తర్వాత వ్యాపారులు నేరుగా బుకింగ్ కౌంటర్ల వద్దకు వెళ్లి బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకున్న ప్రకారం.. నగరంలోని ఆయా ప్రాంతాలకు కార్గో బస్సులు వెళ్లి సరుకులను సంబంధిత డిపో పరిధిలోని వ్యక్తులకు అందజేస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ బుకింగ్ కౌంటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. కార్గో బస్సుల్లో పనిచేస్తున్న సిబ్బంది వ్యాపారులకు నమ్మకమైన సేవలందిస్తున్నారు. కార్గో బస్సుల్లో వచ్చే పా ర్సిళ్లు, ఇతరత్రా సరుకులను నమ్మకంగా వారికి చేరవేయటంలో సిబ్బంది చూపిస్తున్న చొరవ వ్యాపారులను ఆకట్టుకుంటున్నది.
రంగారెడ్డి జిల్లాలోని పలు డిపోల్లో కార్గో బస్సు సేవలను మరింత విస్తరించేందుకు త్వరలోనే హోం డెలివరీ విధానాన్ని ప్రవేశ పెట్టాలని టీఎస్ఆర్టీసీ యోచిస్తున్నది. ప్రస్తు తం ఉన్న కార్గో బస్సులు కొన్ని సంస్థలు, వ్యాపారులకు మాత్రమే పరిమితంగా నడుస్తున్నాయి. ఇక నుంచి కార్గో సేవలను మ రింత విస్తరించాలని అధికారులు భావిస్తు న్నారు. ముఖ్యంగా ఒక్క డిపో నుంచి మరో డిపోకు చిన్న, చిన్న పా ర్సిళ్లు, ఇతరత్రా సరుకులను హోండెలివరీ చేయాలని, ఇందుకోసం మరికొంత మంది సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తున్నారు.
జిల్లాలోని ఒక్కొక్క డిపో పరిధిలో నాలుగు నుంచి ఎనిమిది వరకు కార్గో పార్సిల్ బస్సులున్నాయి. ఈ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. హోం డెలివరీ విధానాన్ని ప్రవేశపెడితే కార్గో బస్సులను మరిన్ని పెంచాల్సి వస్తుంది. అలాగే.. జిల్లాలోని శివారు ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయలను సైతం కార్గో బస్సుల ద్వారా నగరంలోని వివిధ మార్కెట్లకు తరలించే విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నా రు. రైతుల పొలాల నుంచే ఈ కూరగాయలను మార్కెట్కు తరలించే విధానం ద్వారా కార్గో బస్సులకు మరింత ఆదాయం సమకూరనున్నది.