యాచారం : మండల నిధులను ఎటువంటి తీర్మాణం లేకుండా ఎంపీపీ సుకన్య ఖర్చు చేసినందుకు ఆమెపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల టీఆర్ఎస్ ఎంపీటీసీలు మంగళవారం జిల్లా కలెక్టర్ అమయ్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ 2019, జూలై 4నుంచి ఎంపీటీసీలుగా కొనసాగుతున్నప్పట్టికీ ఇప్పటి వరకు మండల నిధులు, ఖర్చులకు సంబంధించి ఎలాంటి తీర్మాణాలు చేయలేదన్నారు. ఎంపీపీ అధ్యక్షతన పలుమార్లు జనరల్బాడీ సమావేశాలు నిర్వహించి అధికారులతో సమీక్షించడం తప్ప ఎలాంటి తీర్మాణాలు చేయలేదన్నారు.
జూలై 4, 2019నుంచి మార్చి 31, 2021 వరకు లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ సభ్యుల తీర్మాణాలు లేకుండా నిధులు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. నిధుల ఖర్చులపై ఎంపీపీని వివరణ కోరగా సర్వసభ్య సమావేశంలో నిధులు, ఖర్చులపై చర్చ అవసరం లేదని, నా చాంబర్కి వస్తే చెబుతానని సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు. 2020-21, 2021-22 సంవత్సరాలకి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను కూడా ఎంపీటీసీ సభ్యులను సంప్రదించకుండా తనకు నచ్చిన గ్రామాలకు నిధులు కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 167, 169 ప్రకారం.. మండల నిధులను మండల పరిషత్ ఆమోదం లేనిదే ఖర్చు చేయొద్దని, చట్టానికి విరుద్ధంగా ఎంపీపీ నిధులను ఎలా ఖర్చు చేస్తారని మండిపడ్డారు. అధికారులను భయపెడుతూ చిన్న చిన్న పనులకు లక్షల్లో నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు రాయడం సబబు కాదన్నారు.
సభ్యుల తీర్మాణం లేకుండా మండల నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపాలన్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి అన్ని రకాల ఆధారాలున్నాయన్నారు. సభ్యుల తీర్మాణం లేకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీటీసీలు డేరంగుల శారద, సుమతమ్మ, మొరుగు శివలీల, ఇస్త్రత్బేగం ఉన్నారు.