షాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) హరిప్రియ పాల్గొని పూజ చేసి బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంప్రదాయలను కనుమరుగు కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందని, ప్రపంచంలో ఎక్కడాలేని పూల పండుగ మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగగా చేసుకుంటున్నామని తెలిపారు. ఈ పండుగను అందరం కలిసి చేసుకోవడం సంతోషకరమన్నారు.
మన రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక సంపదకు బతుకమ్మ చిరునామని, అద్భుతమైన ఈ పండుగను భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బతుకమ్మ వేడుకల్లో జిల్లా సంక్షేమాధికారి మోతి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రత్నకల్యాణి, సీడీపీవోలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.