ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 26: కరువుతో అల్లాడుతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఇటీవల కురుస్తున్న వర్షాలు జీవం పోసినట్లయ్యింది. కొన్నాళ్లుగా వర్షాభావ పరిస్థితులతో నియోజకవర్గంలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోయి, బోరు బావులు ఎండుముఖం పట్టాయి. మెట్ట పంటలకు కూడా ఆశించినంత దిగుబడి రాలేదు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగానికి ఈసారి కురిసిన వర్షాలు ఎంతో ఊరటనిచ్చాయి. దీంతో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. అనేక గ్రామాల్లో చెరువులు, చెక్డ్యాంలు నిండి నీటితో కళకళలాడుతున్నాయి. బోరుబావుల్లోనూ పుష్కలంగా నీరు చేరడంతో రైతులు తమ పొలాల్లో వరితో పాటు వివిధ రకాల కూరగాయలు, ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలోని గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురువడంతో పంటలు కళకళలాడుతున్నాయి. జొన్న, పత్తి, సజ్జ. ఆముదం, కందులతో పాటు ఇతర కూరగాయల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
చెరువు, కుంటలు, చెక్డ్యాంలలో పుష్కలంగా నీరు
నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, చెక్డ్యాంలలోకి పుష్కలంగా నీరు వచ్చి చేరింది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు, చెక్డ్యాంలు అలుగు దుంకుతున్నాయి. శేరిగూడ సమీపంలోని శేరిగూడ చెక్డ్యాం, తట్టిఖానా చెక్డ్యాం, పోల్కంపల్లి చెరువు, ఆరుట్ల గ్రామంలోని చిన్నబందం, యాచారం మండలంలోని మేడిపల్లి, మల్కీజ్గూడ చెరువులు భారీగా అలుగు దుంకుతున్నాయి. వర్షాలతో బోరుబావుల్లోకి కూడా నీరు పుష్కలంగా చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి..
రెండేండ్లుగా వర్షాలు లేక కరువు కాటకాలతో విలవిలలాడాం. గతేడాదితో పాటు ఈసారి కూడా వర్షాలు బాగా కురువడంతో బోరుబావుల్లో పుష్కలంగా నీరు వస్తున్నది. దీంతో పంటల సాగుకు నీరు పుష్కలంగా ఉంది. ఈసారి పంటలు కూడా బాగా సాగయ్యాయి. దీంతో రైతన్నలు చాలా సంతోషంగా ఉన్నారు.
బుచ్చిరెడ్డి, రైతు, ఇబ్రహీంపట్నం