మోమిన్పేట, జూన్ 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఏడో విడుతకు సన్నద్ధమవుతున్నది. మండలంలో మూడు లక్షల మొక్కలు నాటేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, పాఠశాలలు, కళాశాలలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, శ్మశాన వాటికలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఉపాధిహామీ కూలీలతో మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీ నర్సరీల్లో టేకు, కానుగు, జామ, మామిడి, బాదం, చింత, ఈత, అల్లనేరేడు, తులసీ మొక్కలతో పాటు వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు సిద్ధంగా ఉంచారు.
‘హరితహారం’కు సిద్ధంగా ఉండాలి
బంట్వారం, జూన్ 27 : త్వరలో నిర్వహించే 7వ విడుత ‘హరితహారం’ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో బాలయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్లతో పాటు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులందరూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందుకు రావాలన్నారు. నిర్ణిత లక్ష్యం మేరకు ప్రతి జీపీ కనిష్టంగా 2000 మొక్కల నుంచి 10 వేల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. పీఆర్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లు, ప్రభుత్వ, సామూహిక ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు.
పల్లె ప్రగతి’ పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జులై నుంచి ప్రారంభమైయ్యే ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రధానంగా గ్రామాల్లో పాడుబడిన బావులు పూడ్చి, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసేలా సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చెత్త కుప్పలు లేకుండా, కలుపు మొక్కలు తొలగించాల్సిన బాధ్యత సర్పంచ్లదేనన్నారు. ఆయా గ్రామ పంచాయాతీ కార్యదర్శులు తప్పనిసరిగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్థానికంగానే ఉండాలని సూచించారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆదేశించారని, ఈ ఆదేశాలను దిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.]
ఏర్పాట్లు పూర్తి
ఈ ఏడాది హరితహారంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో 3.8లక్షల మొక్కలు పెంచగా, ఏడో విడుత నాటేందుకు 1.94లక్షలు మొక్కలు సిద్ధంగా ఉంచాం. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం.