కొడంగల్, జూన్ 21 : ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాల అమ్మకాలపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో పట్టుబడ్డ నకిలీ విత్తనాలపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని కర్ణాటకకు చేరువలో ఉన్న గ్రామాల్లోనే అధికంగా నకిలీ విత్తనాల వ్యాపారాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కొడంగల్, దౌల్తాబాద్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా ఆకస్మిక దాడులు నిర్వహించి ఈ మధ్యకాలంలో 23 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోగా 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 18న కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామంలో సమాచారం మేరకు దాడులు నిర్వహించగా ఓ ఇంట్లో నకిలీ విత్తనాలతో పాటు లైసెన్స్లు లేకుండా అమ్ముతున్న కంపెనీ విత్తనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆమెను విచారించగా కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్ పట్టణంలోని ధనలక్ష్మి ఫర్టిలైజర్ దుకాణ యజమాని హరికృష్ణ వద్ద ఈ నెల 2న కొన్నట్లు తెలిపారన్నారు. హరికృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టగా 21న సాయంత్రం కొడంగల్ బస్టాండ్లో అనుమానం వచ్చి పట్టుకొని విచారించినట్లు తెలిపారు. విచారణలో పొంతనలేని, తడబడినట్లుగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. సర్పంచుల సమక్షంలో విచారించగా.. ఆయన చేసిన నకిలీ విత్తనాల వ్యాపారం గురించి పూర్తి వివరాలు అందించడంతోపాటు హైదరాబాద్లో ప్యాకింగ్ కవర్లను ప్రింటింగ్ చేయించి విక్రయిస్తున్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
8 గోనె సంచులు, ఒక్కో సంచిలో 40కేజీల లూస్ పత్తి విత్తనాలు, 60 ప్యాకెట్లు పల్లవి సీడ్స్, 290 ఖాళీ ప్యాకింగ్ కవర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.విత్తనాల కొనుగోలులో రైతులు అన్నింటా జాగ్రత్తలు తీసుకోవాలని, మోసపూరిత వ్యాపారస్తుల మాటలు నమ్మవద్దని సీఐ తెలిపారు. నకిలీ విత్తనాలు కొని పంటలను నష్టపోవద్దని, గుర్తింపు డీలర్ల వద్ద పత్తి విత్తనాలను కొనుగోలు చేసి తప్పకుండా రశీదు పొందాలని తెలిపారు. పంట అమ్మకాలు పూర్తయ్యే వరకు రశీదును భద్రపరచాలని తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏవో బాలాజీ ప్రసాద్, దౌల్తాబాద్ ఎస్ఐ విశ్వజన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తాండూరు మండలంలో 26 కిలోల నకిలీ పత్తి విత్తనాలు
నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతోపాటు రూ.41,600 విలువైన 26 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి అన్నారు. సోమవారం కరణ్కోట పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. తాండూరు మండలం, పర్వతాపూర్ గ్రామానికి చెందిన గుడాటి శ్రీనివాస్రెడ్డి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఇంటిపై దాడి చేయగా.. 8 కిలోల పత్తి విత్తనాలు లభించాయి. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చావని ప్రశ్నించగా.. తాండూరు పట్టణంలో మిరియానం నరేశ్కుమార్ నుంచి ఈ నకిలీ విత్తనాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని షావుకారిపేటలోని మిరియానం నరేశ్కుమార్ ఇంటిపై దాడి చేయగా, 18 కిలోల విత్తనాలతోపాటు ఒక వేయింగ్ మిషన్ లభించింది. ఈ విత్తనాలు ఎవరి నుంచి తీసుకువచ్చారని పశ్నించగా, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్లోని శ్రీరామ ఫర్టిలైజర్స్, గంజిపల్లి శ్రీనివాస్ పట్టణంలో ఓ గది అద్దెకు తీసుకొని ఇద్దరు కలసి నకిలీ పత్తివిత్తనాలు విక్రయించినట్లు విచారణలో తేలింది. మండల వ్యవసాయాధికారి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.