‘విజయగర్జన సభకు భారీగా తరలిరావాలి.. ఒక్కో గ్రామానికి ఒక్కో బస్సును ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు వచ్చేలా చూడండి..’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి సబితారెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 25న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభ సక్సెస్ కోసం రంగారెడ్డి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా అభివృద్ధిలో దూసుకెళ్తుంటే చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇక నుంచి విమర్శలు చేస్తే తిప్పికొట్టి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.
రంగారెడ్డి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25న పార్టీ ప్లీనరీ సమావేశంతోపాటు వచ్చే నెల 15న వరంగల్లో జరుగనున్న విజయగర్జన సభకు భారీగా తరలిరావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం టీఆర్ఎస్ భవన్లో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్లీనరీతోపాటు విజయ గర్జన సభను విజయవంతం చేసేందుకుగాను జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్లో జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ప్రతీ గ్రామం నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్లాన్ చేయాలని సూచించారు.
ప్రతీ ఊరు నుంచి ఒక బస్సు వరంగల్ సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకుగాను సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బాధ్యత తీసుకొని, సొంతంగా బస్సులు ఏర్పాటు చేసుకొని వరంగల్ సభకు రావాలన్నారు. అయితే పార్టీ శ్రేణులను సమయాత్తం చేసేందుకుగాను ఎమ్మెల్యేలు నియోజకవర్గస్థాయిలో సమావేశాలను నిర్వహించాలని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా ప్లీనరీ సమావేశానికి సంబంధించి పాసులున్నవారు మాత్రమే హాజరుకావాలన్నారు. ప్లీనరీకి పార్టీ తరపున హాజరయ్యే ప్రతినిధులకు త్వరలోనే ఆహ్వానం అందుతుందని, మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సీనియర్ నాయకులు కలిపి నియోజకవర్గానికి 50 మంది హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. మరోవైపు దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలుచేస్తున్నామని, రాష్ట్రం ఏర్పాటైన తక్కువ సమయంలోనే అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతుంటే, అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ఇకపై విమర్శలు చేస్తూ ఊరుకోకుండా ప్రతీస్థాయిలో తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గాంధీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, కార్తీక్రెడ్డి, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అధ్యక్ష పదవికి కేసీఆర్ను బలపరుస్తూ నామినేషన్
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కేసీఆర్ను బలపరుస్తూ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు తీగల అనితారెడ్డి, సునీతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో నామినేషన్ పత్రాలను అందజేశారు.
27న నియోజకవర్గస్థాయి సమావేశం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి
వచ్చే నెల 15న వరంగల్లో జరుగనున్న పార్టీ విజయ గర్జన సభకు నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 27న నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశాన్ని నిర్వహించి, పార్టీ శ్రేణులకు పిలుపునిస్తాం. ప్రతీ గ్రామం నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. ఆ దిశగా మా నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున సభకు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు.