శంకర్పల్లి, జూన్ 18 : రైతులు తీగజాతి పంటల సాగుపై దృష్టి సారించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు తీగజాతి పంటల సాగుపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సునంద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ…ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తీగజాతి పంటల సాగుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చని సూచించారు. జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సునందరాణి మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో తీగ జాతి కూరగాయలు సాగు చేయడానికి 85 మంది ఎస్సీ, ఎస్టీ రైతులను ఎంపిక చేశామన్నారు. సమావేశానికి హాజరైన రైతులు ఈ పథకం అన్ని వర్గాల రైతులకు కల్పించాలని కోరారు. సమావేశ అనంతరం మండల పరిషత్ సముదాయ ప్రాంతంలో నిర్మిస్తున్న మహిళా శిక్షణ కేంద్ర భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగడంపై ఏఈ ప్రశాంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ను తొలిగించి వేరే కాంట్రాక్టర్తో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి..
మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధ్ది పనులను పూర్తి అయ్యేలా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మికి అదనపు కలెక్టర్ సూచించారు. పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాలని కమిషనర్ యాదగిరిని ఆదేశించారు. పట్టణంలో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న ఆడిటోరియం భవనాన్ని పరిశీలించారు. మోకిల శివారులో నిర్మిస్తున్న మార్కెట్ భవన నిర్మాణం పనులను పరిశీలించారు. తహసీల్ కార్యాలయంలో ఉన్న పాత సామగ్రిని తొలిగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీఆర్డీవో ప్రభాకర్, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో సత్తయ్య, ఏపీవో నాగభూషణం, కౌన్సిలర్ శ్రీనాథ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు వెంకట్రెడ్డి పాల్గొన్నారు.