కొవిడ్ బాధితులకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లు, మందులు, ఆక్సిజన్ నిల్వల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా బాధితుల చికిత్స విషయంలో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రోగులకు సరిపడా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచారు. కొండాపూర్లోని జిల్లా దవాఖాన, వనస్థలిపురంలోని ఏరియా దవాఖానల్లో రెమ్డెసివిర్లను నిల్వ ఉంచి అవసరం మేరకు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీలకు అందిస్తున్నారు. అలాగే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల అక్రమ దందాపై అధికారులు నిఘా పెంచారు. ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు జిల్లా దవాఖానలో అదనంగా మరో 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి, మే 18, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. ఓ వైపు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తూనే మరోవైపు కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలతోపాటు 45 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా కొవిడ్ బారిన పడినవారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే రెమ్డెసివిర్ ఇంజక్షన్లను జిల్లా యంత్రాంగం అందుబాటులో నిల్వ ఉంచింది. కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రితోపాటు వనస్థలిపురంలోని ఏరియా దవాఖానలో ఈ ఇంజక్షన్లను జిల్లా వైద్యారోగ్య శాఖ నిల్వ ఉంచింది. ఇక్కడి నుంచి అవసరం మేరకు జిల్లాలోని ఆయా ప్రభుత్వ దవాఖానలకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు రెమ్డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మాఫియాపై కూడా జిల్లా అధికారులు దృష్టి సారించారు. జిల్లా డ్రగ్స్ అధికారులతోపాటు పోలీసులు జిల్లా అంతటా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్రమంగా విక్రయిస్తున్నవారి నుంచి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొని వారిపై చర్యలు తీసుకున్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అందుబాటులో ఆక్సిజన్ నిల్వలు…
జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొండాపూర్ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా దవాఖానలతోపాటు ఇటీవల ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాల్లో కూడా ఆక్సిజన్ నిల్వలు ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి కొవిడ్ కేర్ కేంద్రాన్ని జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితోపాటు కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కేంద్రంలో 48 గంటలపాటు ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కొండాపూర్లోని జిల్లా దవాఖానలో మరో 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో కొండాపూర్ జిల్లా ఆసుపత్రితోపాటు వనస్థలిపురం ఏరియా, షాద్నగర్, జల్పల్లి, చేవెళ్ల ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ కేర్ కేంద్రాలున్నాయి. కొండాపూర్ జిల్లా, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో ఒక్కో దవాఖానలో 100 పడకల చొప్పున కొవిడ్ చికిత్స నిమిత్తం గత నెల రోజులుగా అందుబాటులో ఉన్నాయి. సంబంధిత ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉండడంతో కొవిడ్ బారిన పడి శ్వాస ఇబ్బందితో వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నారు. కొండాపూర్, వనస్థలిపురం దవాఖానల్లో రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాకుండా కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రిలో రూ.94 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలు, మహేశ్వరంలో 25 పడకలు, షాద్నగర్లో 50 పడకలు, రాజేంద్రనగర్లో 25 పడకలు, పహాడిషరీఫ్లో 25 పడకలతో కొవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలను కూడా 48 గంటలపాటు పడకలకు తగినంతా నిల్వ ఉంచుకునే విధంగా వైద్యారోగ్య శాఖ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ దవాఖానల్లోనూ ఆక్సిజన్ నిల్వలు ఉంచడంతోపాటు కొవిడ్ చికిత్సకుగాను పడకలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 133 ప్రైవేట్ దవాఖానల్లో 7567 పడకలు కొవిడ్ చికిత్స నిమిత్తం అందుబాటులో ఉండగా, వీటిలో 2 వేల వరకు ఆక్సిజన్, వెంటిలేషన్ పడకలు ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
అందుబాటులో రెమ్డిసివిర్
జిల్లాలో సరిపోను రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొం డాపూర్ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురంలోని ఏరియా దవాఖానల నుం చి ఇంజక్షన్లను జిల్లాలోని ఆయా ప్రభుత్వ దవాఖానలకు అవసరం మేరకు సరఫరా చేస్తున్నాం. రెమ్డెసివిర్ అక్రమంగా నిల్వ ఉంచే, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి.
– అమయ్కుమార్, కలెక్టర్, రంగారెడ్డి