దౌల్తాబాద్, జూన్ 11 : కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం గోఖఫస్లవాద్ గ్రామంలో శుక్రవారం భారీగా నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వీరపనేని కొండపనాయుడు కొంత కాలంగా దౌల్తాబాద్ మండలం గోఖఫస్లవాద్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం కొండపనాయుడు నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి నకిలీ పత్తివిత్తనాలను వేరే ప్రదేశానికి తరలిద్దామని వచ్చాడు. పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉండి పట్టుకుని, అతడి ఇంట్లో సోదాలు చేశారు. సుమారు 17 ప్లాస్టిక్ సంచుల్లో మొత్తం 1650 అరుణోదయ ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రతి సంచిలో 100 ప్యాకెట్స్ ఉన్నాయని, ప్యాకెట్ల ధర రూ.730, 450 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. ఒక సంచిలో 50 ప్యాకెట్స్ ఉన్నాయి.
అలాగే 3 ప్లాస్టిక్ సంచుల్లో 366 మేఘన-45 ప్యాకెట్స్, 2 ప్లాస్టిక్ సంచుల్లో మొత్తం 200 బిల్లా-బీజీ-ఐఐ కల్గి, రూ.730 ఒక్కో ప్యాకెట్. అలాగే 1 ప్లాస్టిక్ సంచిలో 36 కాలపతరు-కేసీహెచ్బీ-3355 బీజీ-ఐఐ కలిగి ఉందని ప్రతి ప్యాకెట్పై ధర రూ.730 ఉండగా, 450గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 10 క్వింటాళ్ల 13 కిలోల నకిలీ పత్తివిత్తనాలు, ప్యాకింగ్ మిషన్స్, 5 లీటర్ల కలర్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దౌల్తాబాద్ మండలంలోని బిచ్చల్ గ్రామంలో నివాసం ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన గంగావరప్పు శ్రీనివాసులు ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు దౌల్తాబాద్ ఇన్చార్జి వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్, ఎస్ఐ విశ్వజన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్పీ నారాయణ వెల్లడించారు. ఈ దాడుల్లో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏడీఏ వివేక్కుమార్, ఏవో బాలాజీ ప్రసాద్, కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, దౌల్తాబాద్ ఎస్ఐ విశ్వజన్ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులు సమాచారం ఇవ్వాలి
జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వారు తెలిపారు.