షాబాద్, ఏప్రిల్ 11: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫ్రంట్లైన్ వారియర్స్, ప్రజాప్రతినిధులు, 45 ఏండ్లు దాటిన వారికి టీకా వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అపోహలు ఉన్నవారికి వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. వైద్యసిబ్బంది సూచనలతో టీకా తీసుకునేందుకు ప్రజలు భారీగా ముందుకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో టీకా ఉత్సవ్ కార్యక్రమం ద్వారా నాలుగు రోజుల పాటు టీకా వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 11 నుంచి 14వరకు రోజుకు 20 వేల మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 45 ఏండ్లు పై బడిన వారితో పాటు 18 ఏండ్లు పైబడిన ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా వేయనున్నట్లు చెప్పారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూర్, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలోని 40 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 5,100 మందికి టీకా వేశామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి తెలిపారు.
గ్రామాల్లో ప్రజలకు అవగాహన..
గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి ఇంటింటీ సర్వే చేపడుతున్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు. 45 ఏండ్లు పైబడిన వారు ఎంతమంది. ఫ్రంట్లైన్ వారియర్స్ ఉన్నారా? అనే విషయాలు సేకరిస్తున్నారు. టీకాపై అవగాహన కల్పించి తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. వారం, పది రోజులుగా మండలాల్లో 45 ఏండ్లు పైబడిన చాలా వరకు టీకా వేయించుకుంటున్నారు. సెలవు రోజు సైతం టీకా వేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో దవాఖానల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యసిబ్బంది టీకా వేస్తున్నారు.
భారీగా కరోనా పరీక్షలు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు ఇతర లక్షణాలు ఉన్న వారికి వెంటనే పరీక్షలు చేస్తున్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బంది సూచిస్తున్నారు. మాస్కు ధరించకుంటే జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అధికారులు అందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లాలో 1,804 మందికి టీకాజిల్లాలోని 27 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పరిగి, ఏప్రిల్ 11 : టీకా ఉత్సవ్లో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,804 మందికి టీకా వేశారు. జిల్లాలోని తాండూరు జిల్లా దవాఖాన, పరిగి, కొడంగల్, వికారాబాద్, మోమిన్పేట్ క్లస్టర్ దవాఖానలు, 22 పీహెచ్సీల్లో ఆదివారం సైతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. టీకా ఉత్సవ్లో భాగంగా ఫ్రంట్లైన్ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, హెల్త్కేర్ వర్కర్లకు వయస్సుతో సంబంధం లేకుండా టీకా వేశామన్నారు. వార్డుమెంబర్ మొదలుకుని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, ఉపాధిహామీ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బందికి 45 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ టీకా వేశారు. వారితోపాటు సాధారణ ప్రజలు 45 ఏండ్లు పైబడిన వారు టీకా తీసుకున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు టీకా వేసే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నారు.
మాస్కు ధరించకుంటే రూ.వెయ్యి
కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని సర్కారు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలు అందిన వెంటనే పరిగిలో మున్సిపల్ అధికారులు, పోలీసులు పట్టణంలోని పలు దుకాణాల్లో మాస్క్ ధరించని దుకాణాల యజమానులు, వాహనాలపై వెళ్తున్న వారికి జరిమానాలు విధించారు. ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్, మున్సిపల్ బిల్ కలెక్టర్లు చంద్రశేఖర్, శేఖర్ పట్టణంలోని పలు దుకాణాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. పట్టణంలో 12 మందికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.
వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్
వికారాబాద్, ఏప్రిల్ 11 : అర్హులందరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని కలెక్టర్ పౌసుమి బసు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ను పరిశీలించి మాట్లాడారు. టీకా కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య ఉన్నారు.
టీకా తీసుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండొద్దు
పరిగి, ఏప్రిల్ 11 : టీకా తీసుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండరాదని కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. ఆదివారం పరిగి సర్కారు దవాఖానను కలెక్టర్ సందర్శించి వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు. టీకా ఉత్సవ్లో భాగంగా ఎంతమంది ఉద్యోగులు, ఫ్రంట్లైన్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీకా తీసుకున్న వారితో కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వేయించుకున్నామని నిర్లక్ష్యంగా ఉండవద్దని, మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. 28 రోజుల తర్వాత రెండో విడుత వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. 45 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, దవాఖాన ఇన్చార్జి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
చీకట్లు చీల్చి.. అక్షర జ్యోతులు
మహాత్మాజ్యోతిబాఫూలేకు ఘన నివాళి