అభివృద్ధి బాటలో న్యాలట
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం
గ్రామంలో పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ
చేవెళ్లటౌన్, మే 9 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో న్యాలట గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. న్యాలట జనాభా 974 మంది కాగా ఓటర్లు 726 మంది ఉన్నారు. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం మౌలిక వసతులతో అదర్శంగా నిలుస్తున్నది. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు, హరితహారం నర్సరీ, సీసీ రోడ్లు సౌకర్యలతో న్యాలట ప్రగతి బాటలో సాగుతున్నది. సర్పంచ్ లక్ష్మీసత్యనారాయణ గ్రామ అభివృద్ధికి సొంత నిధులనూ వెచ్చిస్తున్నారు. గ్రామ శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని, చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. చెత్తను పంచాయతీ ట్రాక్టర్ సాయంతో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. రైతులు పొలాలకి వెళ్లేందుకు ఫార్మేషన్ రోడ్డు సైతం వేయించారు. ప్రభుత్వం పెద్దమొత్తంలో గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో అభివృద్ధి సాధ్యమవుతున్నదన్నారు.
రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు..
న్యాలట గ్రామానికి వెళ్లె రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ను సద్వినియోగం చేసుకుంటూ ట్యాంకర్ ద్వారా నీరు సరాఫరా చేసి సంరక్షిస్తున్నారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
వెనుకబడి ఉన్న న్యాలట గ్రామాన్ని ప్రభుత్వం అందిస్తున్న నిధులు, ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో అభివృద్ధి పథం లో నడిపిస్తున్నాం. గ్రామస్తులు, యువకులు గ్రామాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండగా కృషి చేస్తా.
-లక్ష్మీసత్యనారాయణ, న్యాలట, సర్పంచ్
గామాభివృద్ధికి అధిక నిధులు
రాష్ట్రం ఏర్పడ్డాకా అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. దీంతో గ్రామాల్లోని సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి. గ్రామం లో మౌలిక వసతులు ఏర్పడ్డాయి. ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
అందిరి సహకారంతోనే అభివృద్ధి..
ఉన్నతాధికారుల అదేశాల మేరకు న్యాలట గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా అన్ని రకాల పనులు సకాలంలో పూర్తి చేశాం. సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాం. హరితహారంలో నాటిన మొక్కలకు పంచాయతీ ట్రాక్టర్తో ప్రతి రోజు నీరు పోస్తూ సంరక్షిస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తున్నాం.
-శేఖర్, పంచాయతీ కార్యదర్శి, న్యాలట