రంగారెడ్డి, జూలై 7, (నమస్తే తెలంగాణ): జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు విడుతల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పనులు చేపట్టడంతో ప్రతి పంచాయతీలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ప్రస్తుతం పది రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతికి జిల్లా ఉన్నతాధికారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పట్టణాల్లోనూ పచ్చదనం- పరిశుభ్రతతోపాటు అన్నింటిలోనూ ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం బుధవారంతో ఏడు రోజులు పూర్తిచేసుకుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో 16 మున్సిపాలిటీల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పట్టణ ప్రగతిలో ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతున్నారు. పది రోజుల్లో ప్రధానంగా పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేయడంతోపాటు ముండ్ల పొదలు తొలగించడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, పాడు బడిన బావులు, పాత భవనాలను కూల్చివేయడం, విద్యుత్తు సమస్యలను పరిష్కరించడం, రహదారులను శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయి. పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ఆయా మున్సిపాలిటీల్లోని ప్రజలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
పట్టణాల్లో ఎంతో మార్పు..
ఏడు రోజులుగా ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఎంతో మార్పు కనపడుతున్నది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులతోపాటు ముండ్ల్ల పొదల తొలగింపు, చెత్తాచెదారాన్ని ఏరివేయడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో జిల్లా మంత్రితోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. పారిశుధ్యంపై ప్రజలకు ర్యాలీలతో అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ, కొత్త స్తంభాల ఏర్పాటు, వంగిపోయిన స్తంభాలను సరిచేయడం వంటి పనులు చేపడుతున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించడంతో సీజనల్ వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయి.
కలెక్టర్ ఆకస్మిక పర్యటనలు
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పనులు జోరందుకున్నాయి. మొదటి విడుతలో చేపట్టిన పట్టణ ప్రగతి పనులపై జిల్లా మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రి పర్యటిస్తూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హరితహారం, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ ఆమయ్కుమార్ రోజుకొక మున్సిపాలిటీలో ఆకస్మికంగా పనులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, షాద్నగర్, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో పర్యటించారు. పట్టణ ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్ మున్సిపాలిటీల్లో ఆకస్మిక పర్యటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు.