హైదరాబాద్, సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ తరచూ రూపుమార్చుకుంటున్నది. దీంతో వ్యాధి లక్షణాలు, శరీరంపై తీవ్రత, రోగకాలం.. ఇలా అన్నీ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మొదటి వేవ్లో కనిపించిన లక్షణాలు ఇప్పుడు పెద్దగా కనిపించకుండానే బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కిడ్నీ, రక్త సంబంధ సమస్యలు ఎదురై కొందరు తక్కువ సమయంలోనే ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. మొదటి వేవ్లో 1 నుంచి 2 వారాలు మాత్రమే శరీరంలో వ్యాధి ప్రభావం కనిపించగా, ఇప్పుడు 2 నుంచి 4 వారాల పాటు సతాయిస్తున్నది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత (లాంగ్ కొవిడ్) కూడా దీర్ఘకాలిక ఇబ్బందులు తలెత్తుతున్నట్టు స్పష్టమవుతున్నది. మొదట్లో మైల్డ్, మోడరేట్, సీరియస్ పరిస్థితులు ఎదురుకాగా, ఇప్పుడు నేరుగా మోడరేట్, సీరియస్ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇందుకు మహారాష్ట్ర వేరియంట్ ప్రధాన కారణమైతే.. చేతులారా చేస్తున్న తప్పులు కూడా వైరస్ విజృంభణకు దోహదమవుతున్నదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రెండు వేవ్లకు చాలా తేడాలు
మొదటి వేవ్లో కరోనా వచ్చినవాళ్లకు, ఇప్పుడు వైరస్సోకినవారికి చాలా తేడా కనిపిస్తున్నది. గతేడాది కరోనా విజృంభించిన సమయంలో బాధితుల్లో ఒకేరకమైన లక్షణాలు కనిపించేవి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు వంటివి ఉండేవి. వీటిని గుర్తించి వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే అసలు విషయం బయటపడేది. సెకండ్ వేవ్లో అలా లేదు. ఒకేరకమైన లక్షణాలు కనిపించకుండానే శరీరంపై వైరస్ దాడి పూర్తిచేస్తున్నది. సాధారణంగా వైరస్ శరీరంలో ప్రవేశించి నాటి నుంచి తీవ్ర ప్రభావం చూపే వరకు నాలుగు దశలు ఉంటాయి. ఇవి ఇంక్యుబేషన్, వైరీమియా, ఎర్లీ లంగ్, లేట్ లంగ్. సాధారణంగా ఇంక్యుబేషన్ పీరియడ్ 5 రోజులు ఉంటే, సెకండ్ వేవ్లో 3 రోజులకు, వైరీమియా 7 నుంచి 5 రోజులకు తగ్గింది. దీంతో వైరస్ సోకినప్పటికీ లక్షణాలు గుర్తించే లోపు నేరుగా మూడో దశకు వెళ్లిపోతున్నది. సాధారణంగా కనిపించే లక్షణాలు సెకండ్ వేవ్లో కనిపించడం లేదు. కిడ్నీపై ప్రభావం మొదలైన దశ అంటే ఎర్లీ లంగ్, లేట్ లంగ్లో అసలు విషయం బయట పడుతున్నది. అందుకే రెండో వేవ్ వైరస్ను ముందుగా గుర్తించేందుకు.. ఇప్పుడు ర్యాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షల కంటే సీటీ స్కాన్పై వైద్యులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పరీక్షల కంటే కూడా చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నది. ట్రీట్మెంట్ ఫస్ట్ విధానంతో ముందస్తు వైద్యం అందిస్తూ.. ప్రాణాపాయస్థితికి చేరుకోకుండా చర్యలు తీసుకుంటున్నది.
ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేస్తుండాలి..
సెకండ్ వేవ్లో వైరస్ ప్రభావం చాలా భిన్నంగా ఉంటున్నది. ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్ఫెక్ట్ అయినప్పటికీ లక్షణాలు త్వరగా బయట పడటంలేదు. అవి ఒక్కసారిగా విఫలమయ్యేసరికి రోగి అకస్మాత్తుగా చనిపోతున్నాడు. మరికొందరు 14 రోజుల ఐసొలేషన్ తరువాత ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు చెందిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడమే ఇందుకు కారణం. ఇది ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో జరుగుతున్నది. దీనిని నివారించేందుకు ముందు నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఐసొలేషన్ సమయంలో, కోలుకున్న తర్వాత ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకుంటూ.. ఉండాలి. ఆక్సీమీటర్ అందుబాటులో లేకుంటే.. ఊపిరి విడుదల చేసి 30 సెకండ్లపాటు అలాగే ఉండేందుకు ప్రయత్నించాలి. కనీసం 20 సెకండ్లపాటు ఉండలేకపోతున్నామంటే ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నదని అర్థం. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ నిపుణుడు, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన
బ్లడ్ థిన్నర్స్ వాడాలి..
కరోనా రోగుల్లో చాలా మందికి గుండె, మెదడు, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నది. అలా జరిగినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. గుండె, మెదడు వంటి ప్రధాన అవయవాలకు రక్తసరఫరా ఆగిపోయి విఫలమవుతాయి. దీంతో రోగి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వైరస్ వచ్చిన 14 రోజుల తరువాత కూడా కనీసం మూడు వారాలు బ్లడ్ థిన్నర్ మందులు (రక్తం పలుచన చేసేవి) వాడాలి. దీనివల్ల రక్తం గడ్డకట్టకుండా రక్షించుకోవచ్చు. బీపీ, షుగర్ ఉన్నవారు, వృద్ధులు ముందు జాగ్రత్తగా సంబంధిత మందులు వాడాలి. దీంతో గుండెపోటు, ఆక్సిజన్ పడిపోవడం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. స్టెరాయిడ్స్ను వైద్యుల సూచనల మేరకే వాడాలి. ఐసొలేషన్ తరువాత కూడా జాగ్రత్తగా ఉండాలి.
డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజి విభాగాధిపతి నిమ్స్ దవాఖాన
అనారోగ్యానికి దారి తీస్తున్న అంశాలు..
మైల్డ్గా లక్షణాలు ఉన్నప్పుడు లెక్క చేయడం లేదు. సివియర్గా లక్షణాలు వచ్చినప్పుడు అప్రమత్తమవుతున్నారు. దవాఖానకు వెళ్లే సమయానికి క్లిష్టంగా మారతున్నది.
నిర్ధారణ పరీక్షల పేరిట కాలయాపన చేయడం. పాజిటివ్ రిపోర్టు వచ్చే వరకు చికిత్స ప్రారంభించకపోవడం.ఇష్టానుసారంగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. సీరియస్, హాస్పిటలైజ్డ్ కేసుల్లోనే స్టెరాయిడ్స్ వినియోగించాలి. దీని అతి వినియోగం వల్లే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతున్నది.సాధారణ లక్షణాలు ఉండి ఇంట్లో చికిత్స పొందుతున్నవారు నిత్యం అప్రమత్తంగా ఉండటం లేదు. నిజానికి లక్షణాల్లో తేడా కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. వారి సూచన మేరకు మందులు వాడాలి.
ఆక్సిజన్ శాతం పట్టించుకోవడం లేదు. ఐసొలేషన్లో ఉన్నవారు ఆక్సిజన్ స్థాయిని ప్రతి 6 గంటలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. 94 శాతం కంటే తక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక రోగులు బ్లడ్ షుగర్, బీపీ లెవల్స్ని చెక్చేసుకోవాలి.మోడరేట్ లక్షణాలున్నవారిని పడకల కోసం నచ్చిన దవాఖానలో బెడ్ కోసం తిప్పడం కంటే, సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించాలి. దీని వల్ల సకాలంలో వైద్యం అందుతుంది.కొవిడ్ తగ్గిన తర్వాత కూడా మాస్కులు ధరించాలి. భౌతికదూరం, శుభ్రత పాటించాలి. ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సెకండ్ వేవ్ దీర్ఘకాలిక సమస్యలు
గుండె సంబంధిత- రక్తం గడ్డకట్టడం
శ్వాస సంబంధిత-ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్
చర్మ సంబంధిత- దద్దుర్లు
మెదడు- రుచి, వాసన కోల్పోవడం, నిద్ర పట్టకపోవడం
సైకియాట్రిక్- మానసిక ఒత్తిడి, ఆత్రుత
ఈఎన్టీ సంబంధ- బ్లాక్ ఫంగస్, కండ్లు ఎర్రబడటం