రంగారెడ్డి, మే 3, (నమస్తే తెలంగాణ)/కొత్తూరు: కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న కొత్తూరు మున్సిపాలిటీలో అధికార పార్టీ టీఆర్ఎస్ పాగా వేసింది. ఈ మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఎన్నికలేవైనా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మరోసారి రుజువైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడాలేని విధంగా అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గులాబీ జెండా ఎగురేలా చేశాయి. కొత్తూరును కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. కొత్తూరును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో సంబ్బండ వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు జై కొట్టారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం ముగిసే వరకు అంతా తానై స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుండి నడిపించారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో కొత్తూరులో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. మరోవైపు కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ వికసించలేదు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి వచ్చి ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించినా కనీసం ఒక్క వార్డులో కూడా గెలువకపోవడం గమనార్హం.
కొత్తూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం..
తొలిసారి ఎన్నికలు జరిగిన కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని 12 వార్డులకు ఎన్నికలు జరుగగా, 7 వార్డుల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మిగతా 5 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2, 3, 7, 8, 10, 11, 12 వార్డుల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కొత్తూరు మున్సిపాలిటీలో 8222 ఓట్లకు 7023 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 3409 ఓట్లు (48.54 శాతం), కాంగ్రెస్కు 2260 ఓట్లు (32.17 శాతం), బీజేపీకి 770 ఓట్లు(10.96 శాతం) వచ్చాయి. అత్యధికంగా టీఆర్ఎస్ అభ్యర్థికి 292 ఓట్ల ఆధిక్యత లభించడం గమనార్హం.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ
కొత్తూరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం మధ్యాహ్నంలోగా పూర్తయ్యింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకాగా గంటలోనే తొలిరౌండ్ ఫలితం వచ్చింది. మొదట వచ్చిన 4 వార్డుల ఫలితాల్లో రెండు టీఆర్ఎస్, రెండు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచాయి. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో మూడు వార్డుల్లో టీఆర్ఎస్, ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. చివరి రౌండ్లో రెండు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందగా, మిగతా రెండు వార్డుల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకున్నది.
కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ పాగా..
కొత్తూరు మున్సిపాలిటీగా ఏర్పాటైన అనంతరం తొలిసారి ఎన్నికలు జరిగాయి. అంతకుముందు పంచాయతీగా ఉన్న కొత్తూరులో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ గెలుపొందింది. కొన్నేండ్లుగా కాంగ్రెస్కు షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు కంచుకోటగా మారింది. అయితే కొత్తూరు మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. బెంగళూరు జాతీయ రహదారికి అనుకుని కొత్తూరు అభివృద్ధిని గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న కొత్తూరు మున్సిపాలిటీని కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులైన ఇతర పార్టీల ముఖ్య నేతలంతా టీఆర్ఎస్లో చేరడంతో కొత్తూరులో అధికార పార్టీ బలంగా తయారైంది. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న కొత్తూరులో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నది.
కనిపించని కమలం పార్టీ..
కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి వచ్చి మరీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా, కనీస పోటీనివ్వకపోవడం గమనార్హం. 12 వార్డులకు ఎన్నికలు జరుగగా కేవలం ఒక వార్డులోనే రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి నిలిచారు. మిగతా అన్ని వార్డుల్లో కనీసం పోటీనివ్వలేకపోయారు. మూడు వార్డులు మినహా మిగతా అన్ని వార్డుల్లో డబుల్ డిజిట్ ఓట్లతోనే బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పలు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. కేవలం రెండో వార్డులో మాత్రమే రెండో స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి నిలిచారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించడంతోపాటు సోషల్ మీడియాలోనూ ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం ఆ పార్టీ అభ్యర్థులను విశ్వసించలేదు. కొత్తూరు మున్సిపాలిటీలో 7023 ఓట్లు పోలవగా బీజేపీకి కేవలం 770 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
అంతా తానై నడిపించిన మంత్రి..
కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతను మంత్రి శ్రీనివాస్గౌడ్కు అప్పగించారు. దీంతో నోటిఫికేషన్ మొదలు పోలింగ్ వరకు పక్కా వ్యూహంతో ముందుకు తీసుకెళ్లారు. కొత్తూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసేందుకుగాను స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలిసి మంత్రి అంతా తానై ముందుకు నడిపించారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు పోటీ పడడంతో, ప్రత్యేకంగా ఆయా వార్డుల్లో సర్వే చేయించి, గెలుపు గుర్రాలనే బరిలోకి దింపారు. మిగతా ఆశావహులను ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశమై నామినేటెడ్ పదవుల్లో అవకాశమిప్పిస్తామని హామీనిచ్చి నామినేషన్లను ఉపసంహరించుకునేలా సఫల ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతోపాటు కార్యకర్తలంతా టీఆర్ఎస్లో చేర్పించడంలోనూ మంత్రి కీలకంగా వ్యవహరించారు.
అభివృద్ధివైపే కొత్తూరు ఓటర్లు..
కొత్తూరును అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం, గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టడంతో కొత్తూరు మున్సిపల్ ఓటర్లు టీఆర్ఎస్కే మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా రోడ్ల వెడల్పు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికీ తాగునీరు, సెంట్రల్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు అధిక మొత్తంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొత్తూరు జంక్షన్ అభివృద్ధికీ ఇటీవల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి దాదాపు రూ.15 కోట్ల నిధులు విడుదల చేసింది. కొత్తూరు మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణానికి రూ.3.50 కోట్లు, కొత్తూరు జంక్షన్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు, అండర్ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.1.87 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.70 లక్షలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు రూ.2 కోట్ల నిధులు విడుదల చేసింది. కొత్తూరులోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలందుతుండడంతో కొత్తూరు మున్సిపల్ ఓటర్లు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపారు.