యాచారం, ఏప్రిల్ 30 : మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నియంత్రణ చర్యలు శుక్రవారం ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రధాన రోడ్లు, వీధుల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, కలుపు మొక్కలు, ప్లాస్టిక్ వస్తువులను తొలిగించి శుభ్రం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా రోడ్లు, వీధులు ఊడ్చి బ్లీచింగ్ పౌడర్ను చల్లి సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. నీటి ట్యాంకులు, సంపులను శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారు. యాచారంలో కరోనా నియంత్రణలో భాగంగా మధ్యాహ్నం 2గంటల తరువాత స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.
కొనసాగుతున్న స్వచ్ఛంద బంద్
కడ్తాల్ ఏప్రిల్ 30 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మూసివేస్తున్నారు. మెడికల్ షాపులు, దవాఖానలకు మినహాయింపు ఇస్తున్నారు. మండల కేంద్రంలో మే 10వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ అమలు ఉంటుందని, మండలంలోని ప్రజలు గమనించాలని వర్తక సంఘం నాయకులు కోరుతున్నారు.
కరోనాపై నిర్లక్ష్యం తగదు
మంచాల ఏప్రిల్ 30 : కరోనాపై ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కిరణ్ ప్రసాద్ అన్నారు. ఆరుట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..ప్రతి రోజూ పీహెచ్సీకి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు.
మైసమ్మ ఆలయం మూసివేత
యాచారం, ఏప్రిల్ 30 : మండలంలోని తాటిపర్తి సమీపంలో ఉన్న తాటికుంట మైసమ్మ ఆలయం మూసివేస్తున్నట్లు పాలకవర్గం సభ్యులు తీర్మానించారు. ఆలయాన్ని మే30 వరకు మూసివేస్తున్నట్లు సర్పంచ్ రమేశ్ తెలిపారు. ఫారెస్ట్ రోడ్డును సైతం మూసివేయనున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి
అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 30 : కొవిడ్-19 వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని వైద్యాధికారి శ్వేత అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాలు పైబడిన 290 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. 38 మందికి పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. బాధితులు ఇంట్లోనే క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలన్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
ఇబ్రహీంపట్నం రూరల్, ఏప్రిల్ 30 : కరోనాను నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సర్పంచ్ కత్తుల పవిత్రకుమార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి అన్నారు. తుర్కగూడలో ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి సహకారంతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.