రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్యూ సమకూర్చుకున్నాయి. గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మొదటిసారిగా వెయ్యి కోట్లు దాటి చరిత్రను సృష్టించాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,266.79 కోట్ల లక్ష్యానికిగాను రూ.3,966.17 కోట్ల ఆదాయం ఆర్టీఏ ఖాతాలో వచ్చి చేరింది. రాష్ట్రం మొత్తం టార్గెట్ రూ.4,953 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రూ.6,247 కోట్లు రాష్ట్ర ఖజానాలో చేరింది. ఇందులో సింహ భాగం గ్రేటర్ జిల్లాలదే. గతేడాది మూడు జిల్లాలు కలిపి రూ.1,967 కోట్లు సమకూర్చగా ఈ సారి రెట్టింపు వచ్చింది.
సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రవాణా శాఖపై కాసుల వర్షం కురిసింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ఎప్పటిలాగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ భారీ ఆదాయం సమకూరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.3,966 కోట్ల రాబడిని సాధించి గ్రేటర్ జిల్లాలు సత్తా చాటాయి. గతంలో ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మొదటిసారిగా వెయ్యి కోట్లు దాటి చరిత్ర సృష్టించాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి 3,266.79 కోట్ల లక్ష్యానికి గాను 3,966.17 కోట్లు ఆర్టీఏ ఖాతాలో జమ కావడం విశే షం. అంతేకాదు రాష్ట్రం మొత్తం టార్గెట్ 4,953 కోట్లు కాగా, లక్ష్యానికి మించి 6,247 కోట్లు రాష్ట్ర రవాణా ఖాతాలో జమ అయింది. ఇందులో సింహభాగం గ్రేటర్ జిల్లాలదే కావడం విశేషం. గతేడాది మూడు జిల్లాలు కలిపి 1,967 కోట్లు రాగా ఈ సారి రెట్టింపు ఆదాయం సమకూరి మొదటి స్థానంలో నిలిచాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వాహనాలు 80 లక్షలకు మించి ఉన్నాయి. రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో వాహనదారులకు సేవలందించడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా శాఖ సేవలను ఆన్లైన్ చేసింది. లెర్నర్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పర్మిట్, కండక్టర్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ట్యాక్స్, ట్రేడ్ సర్టిఫికెట్, రికమెండేషన్ లెటర్ వంటి సేవలన్నీ ఆన్లైన్ చేయడంతో వాహనదారులు ఆర్టీ ఏ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.
ఇప్పటి వరకు రూ. వెయ్యి కోట్లు దాటిన దాఖలాల్లేవు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు దాటడం గొప్ప విషయం. రూ. 1400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ను రీచ్ అవడమే కాకుండా అధిక మొత్తంలో ఆదాయం వచ్చేలా సరైన కార్యాచరణను అవలంబించాం. అధికారులు, సిబ్బంది చాలా బాగా పనిచేశారు. – ప్రవీణ్ రావు, డీటీసీ, రంగారెడ్డి