తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ స్వచ్ఛ పంచాయతీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పల్లె ప్రగతి పనులు జోరందుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 505 గ్రామ పంచాయతీల్లో శ్రమదానం నిర్వహించగా, 18,050 మంది పాల్గొని పనులను పూర్తి చేశారు. 1609 కిలోమీటర్ల మేర రోడ్లను శుభ్రం చేయడంతోపాటు 981 కిలోమీటర్లలో డ్రైనేజీలనూ శుభ్రం చేశారు. అంతేకాకుండా శిథిలావస్థకు చేరిన 407 ఇండ్లను కూల్చివేశారు. 1314 ప్రాంతాల్లో ముళ్ల పొదలను తొలగించారు. గుంతలు, పడావు బోరుబావులను పూడ్చివేశారు. జిల్లావ్యాప్తంగా 410 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలని అధికారులు గుర్తించారు.
రంగారెడ్డి, జూన్ 7, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం జోరందుకుంది. దీంతో గ్రామపంచాయతీలన్నీ స్వచ్ఛ పల్లెలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నెల 3 నుంచి పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభమయ్యింది. మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించి, గ్రామపంచాయతీల్లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికను రూపొందించారు. గత నాలుగు రోజుల్లో పారిశుధ్య పనులతోపాటు విద్యుత్ సమస్యల పరిష్కారం, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులను చేపట్టారు.
జిల్లాలోని 505 గ్రామపంచాయతీల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించగా, 18,050 మంది పాల్గొన్నారు. 558 గ్రామపంచాయతీల్లోని 1609 కి.మీ మేర రోడ్లను పరిశుభ్రం చేయడంతోపాటు 981 కి.మీ వరకు డ్రైనేజీలను శుభ్రం చేశారు. శిథిలావస్థకు చేరిన 407 ఇండ్లు, ఖాళీ స్థలాలను పూడ్చివేయడం, 1314 ప్రాంతాల్లో ముండ్ల పొదలను తొలగించడం, రోడ్లపై ఉన్న 502 గుంతలను పూడ్చివేశారు. జిల్లావ్యాప్తంగా 20 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తికాగా, 20 సామాజిక ఇంకుడు గుంతలను నిర్మించారు. జిల్లాలో ఇప్పటివరకు 14 నిరుపయోగ బోరుబావులను పూడ్చ డం, 24 పడావు బావులను పూడ్చివేయడం, జిల్లావ్యాప్తంగా 410 కి.మీ అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలని గుర్తించారు. 128 వంగిన, నేలకొరిగిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు, 18 వైకుంఠధామాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, 12 వైకుంఠధామాలకు విద్యుత్ సరఫరా, 9 వైకుంఠధామాలకు నీటి సరఫరా, 50 లూజ్ వైర్లను తొలగించడం వంటి పనులను గత నాలుగు రోజుల్లో చేపట్టారు.
జిల్లావ్యాప్తంగా ఇద్దరు దాతలు రూ.5.25 లక్షల విరాళంగా అందజేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు కలిపి 223 మంది, కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, డీపీవో, డీఆర్డీవో తదితరులు కలిపి 65 మంది అధికారులు పాల్గొన్నారు.