200 పడకల ఐసొలేషన్ ఏర్పాటుతో ప్రజలకు మేలు
ఎంపీ రంజిత్రెడ్డి
తాండూరు, మే 19: పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి టీబీ ఆస్పత్రిలో రీజినల్ సబ్ సెంటర్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్) ఏర్పాటు చేసేందుకు, కరోనా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 200 పడకల ఐసోలేషన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించడంపై చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ దేశంలో ఎక్కడ లేనివిధంగా చర్యలు చేపట్టడంతో పాటు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమీక్షలతో అధికారులు, పాలకులు అప్రమత్తంగా వ్యవహరిస్తు ప్రజలకు మెరుగైన సేవలు చేయడం జరుగుతుందన్నారు. పేదలకు సకాలంలో మెరుగైన వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండేందుకు అనంతగిరిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలోని ఆస్పత్రులకు మందులు అందించేందుకు ప్రత్యేక వహనాలు ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడంతో ప్రజలకు చాల మేలు జరుగుతుంది.