పరిగి, జూన్ 7 : వికారాబాద్ జిల్లా పరిధిలో భూగర్భ జల మట్టం పెరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూగర్భ జల మట్టం స్థాయిల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది భూగర్భ జల వనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లా పరిధిలో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో భూగర్భ జల మట్టం 0.36 మీటర్లు పెరిగింది. ఏప్రిల్ నెలలో వికారాబాద్ జిల్లా పరిధిలో సరాసరి భూగర్భ జలమట్టం 12.58 మీటర్లు ఉండగా మే నెలలో 12.21 మీటర్లకు పెరిగింది. తద్వారా నెల రోజుల వ్యవధిలో వర్షాకాలం కంటే ముందుగా కురిసిన వానలతో ఈ మేరకు భూగర్భ జలమట్టం పెరిగిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా యాలాల మండలం ఎన్కెపల్లిలో 0.72 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండడం గమనార్హం.
జిల్లాలోని మండలాల వారీగా..
వికారాబాద్ జిల్లా పరిధిలోని 39 బోర్ల ద్వారా భూగర్భ జల మట్టం వివరాలను సేకరించారు. భూగర్భ జల వనరుల శాఖ అధికారులు మే నెల చివరి వారంలో ఈ వివరాల సేకరణ చేపట్టారు. వారు సేకరించిన వివరాల ప్రకారం మర్పల్లి మండలంలో సరాసరి భూగర్భ జలమట్టం 23.54 మీటర్లు, మోమిన్పేట్లో 8.2 మీటర్లు, నవాబుపేటలో 9.46 మీటర్లు, వికారాబాద్లో 27 మీటర్లు, ధారూర్లో 14.5 మీటర్లు, బంట్వారంలో 9.98 మీటర్లు, దోమలో 14.1, కులకచర్లలో 15.34, పరిగిలో 15.15, పూడూరులో 8.11, బొంరాస్పేట్లో 12.09, పెద్దేముల్ 10.5, తాండూరు 7.16, బషీరాబాద్లో 10.97, యాలాల 9.59, కొడంగల్లో 12.6, దౌల్తాబాద్లో 10.30 మీటర్లుగా భూగర్భ జలాల మట్టం ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దోమ మండలం దిర్సంపల్లిలో గత నెలతో పోలిస్తే అత్యధికంగా భూగర్భ జలమట్టం పెరిగిందని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో దిర్సంపల్లిలో భూగర్భ జలమట్టం 42.32 మీటర్లు ఉండగా మే నెలలో 18.47 మీటర్లకు పెరిగింది.
భూగర్భ జలమట్టంతోపాటు శాంపిల్స్ సేకరణ
వికారాబాద్ జిల్లా పరిధిలో మే నెలాఖరులో ఎంపిక చేసిన బోర్లలో భూగర్భ జలమట్టం వివరాల సేకరణతోపాటు నీటి శాంపిల్స్ సేకరించారు. భూగర్భ జలమట్టం వివరాల సేకరణతో గత నెలతో పోలిస్తే భూగర్భ జలమట్టం ఎంత ఉన్నది తెలుస్తుంది. ఇందులో భాగంగా చాలాచోట్ల ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. ఇందుకు ప్రధాన కారణం మే నెలాఖరులో జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురియడమని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో భూగర్భ జలాలు పరిశీలించగా అత్యధిక స్థానాల్లో నీటిమట్టం పెరిగింది. మరోవైపు ప్రతి సంవత్సరం వర్షాకాలం కంటే ముందు ఆయా బోర్లలో నీటి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని వాటర్ క్వాలిటీ ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపిస్తారు. తద్వారా తాగునీటిలో ఏమేమి, ఏ స్థాయిలో ఉన్నాయనేది వారు పరిశీలించి నివేదికను అందజేస్తారు. తద్వారా ఆయా బోర్లలోని నీరు తాగడానికి అనుగుణంగా ఉన్నాయా, నీటిలో ప్రమాదకర స్థాయిలో ఏవైనా ఉన్నాయా గుర్తించి వివరాలు పూర్తిస్థాయిలో అందించనున్నారు. తాగునీటికి అవకాశం ఉన్నవాటినే వాడుకోవాల్సిందిగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సూచిస్తుంటారు. లేదంటే బట్టలు ఉతకడానికి, ఇతర అవసరాలకే వాడుకోవాలని తెలియజేస్తారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ శాంపిల్స్ సేకరించి నీటి పరీక్షలు జరిపిస్తారు. అందుకు అనుగుణంగానే ఈసారి శాంపిల్స్ సేకరించారు.
వర్షాలతో పెరిగిన భూగర్భ జలాలు
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మే నెలలో వర్షాలు కురియడంతో భూగర్భ జలమట్టం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం పరిశీలించాం. గత నెలతో పోలిస్తే మే నెలలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. రుతుపవనాలు సైతం వస్తుండడంతో ఈ నెలలో భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది.
– జి.దీపారెడ్డి, వికారాబాద్ జిల్లా భూగర్భ జల అధికారి