మంచాల, మే 24 : 60 ఏండ్లుగా రైతులను నట్టేట ముంచిన చరిత్ర కాంగ్రెస్దేనని, రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుకుడాల అంజిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్, ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు.
కండ్లు మూసుకుపోయిన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మండలంలో ఎన్ని గ్రామాలున్నాయో తెలియని మల్రెడ్డి రంగారెడ్డి నేడు రచ్చబండ పేరుతో గ్రామాలకు వచ్చి అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కిషన్రెడ్డి పై విమర్శలు మానుకోవాలన్నారు. ఆ పార్టీకి ప్రజ లు బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్కు భవిష్యత్ లేదన్నారు. సమావేశంలో మారగోని యాదయ్య, జంబుల కిషన్రెడ్డి, సుకన్య, శ్రీనివాస్, పల్లె జంగారెడ్డి, శ్రీశైలం, మార సురేశ్, ప్రవీణ్, శేఖర్, జానయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.