యాచారం, ఏప్రిల్ 21 : యాచారం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం ఇతర గ్రామాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రకృతి రమణీయతను పంచుతున్న పల్లెప్రకృతి వనంతో పల్లెకు కొత్తశోభ సంతరించుకున్నది. ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలేశుడి గుట్టకింద ఉన్న పల్లె ప్రకృతివనం పార్కును తలపిస్తున్నది. పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. సాయంత్రంపూట ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తున్నది. ప్రతి రోజు మూడు ట్యాంకర్ల నీటిని మొక్కలకు పోసి సంరక్షిస్తున్నారు. దీంతో మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు గాను యాచారం పల్లె ప్రకృతివనం అందరినీ కట్టిపడేస్తున్నది. ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరుగడంతో పాటుగా అన్ని రకాల వసతులు ఉండటంతో ఇతర గ్రామాలకు మండల కేంద్రం ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. యాచారం పల్లె ప్రకృతి వనంలో కడియం నుంచి అశోక, బొగోడ, కోనోకార్పస్ ఇతర మొక్కలను తీసుకొచ్చారు. ఏపుగా పెరిగిన పండ్లు, పూలు, డిజైన్ మొక్కలను పెంచుతున్నారు. పంచాయతీ సిబ్బంది నిత్యం ట్యాంకర్తో నీరుపోసి, పాదులు తీసి, కలుపుతీసి సంరక్షిస్తున్నారు. చుట్టూ ప్రహరీతో పాటుగా, రెండు గేట్లు, పెద్ద ముఖద్వారం, మొక్కల మధ్యన నడిచేందుకు, మొక్కలను పరిశీలించేందుకు వాకింగ్ ట్రాక్, పచ్చని చెట్ల మధ్యన కూర్చొని సేద తీరేందుకు దాతల సహకారంతో ప్రత్యేక కుర్చీలను ఏర్పాటు చేశారు.
యాచారం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 3,500ల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో యాచారం పల్లెప్రకృతి వనంలో మొత్తం 2600 మొక్కలు గ్రామపంచాయతికి అనుబంధంగా ఉన్న మొగుళ్లవంపులో 800 మొక్కలు, గాండ్లగూడలో 120 మొక్కలను పెంచుతూ వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. ఇటీవల అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ యాచారం పల్లె ప్రకృతి వనం నిర్వహణను చూసి అభినందించారు. నిర్వహణ ఎంతో బాగుందని కితాబిచ్చారు. జిల్లాలోనే యాచారం ప్రకృతివనం అన్ని రంగాల్లో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది.
పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్న ప్రతి మొక్కనూ బతికిస్తాం. వనంలోని మొక్కలను వృక్షాలుగా మలచడంమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పంచాయతీ సిబ్బంది నిత్యం ఉదయం, సాయంత్రం మొక్కలకు నీళ్లను పోసి బతికిస్తున్నారు. వనం చుట్టూ ప్రహరీ, ముఖద్వారం, రెండు గేట్లు, నడిచేందుకు అన్ని వైపులా దారి, కూర్చునేందుకు కుర్చీల వసతిని ఏర్పాటు చేశాం. ప్రకృతి వనాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం.
– ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి, సర్పంచ్ యాచారం
పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలు పచ్చదనంతో పాటుగా ప్రతి ఒక్కరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వేసవిలో సాయంత్రం వాకింగ్ అనంతరం సేదతీరేందుకు పల్లె ప్రకృతివనం ఎంతగానో ఉపయోగపడుతున్నది. మొక్కలను వృక్షాలుగా, చిట్టడివిలా రూపొందించడమే ధ్యేయంగా పని చేయాలి. నందనవనంలా అన్ని వసతులతో పార్కులా తీర్చిదిద్దాలి. పల్లె ప్రకృతి వనం తీరొక్క చెట్లతో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటుగా వర్షాలు కురిసేందుకు చెట్లు ఉపయోగపడుతాయి.
– మస్కు రమేశ్, యాచారం