రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 26 : ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి కమిటీలను నియమించగా, తాజాగా జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి అప్పగించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వరుసగా ఏడేండ్లు బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, పలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో మంచిరెడ్డి కిషన్రెడ్డిని అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలను అందరినీ కలుపుకొని సమష్టిగా ముందుకెళ్తామన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతీ కార్యకర్తకు అండగా నిలుస్తానన్నారు.
బయోడేటా
పేరు మంచిరెడ్డి కిషన్రెడ్డి
తల్లిదండ్రులు భూపాల్రెడ్డి, పద్మమ్మ
సతీమణి ముకుందమ్మ
కూతురు శీతల్
కుమారులు ప్రశాంత్కుమార్రెడ్డి, వెంకట్రెడ్డి
విద్యాభ్యాసం బీఏ(నిజాం కాలేజీ)
స్వగ్రామం ఎలిమినేడు, ఇబ్రహీంపట్నం
పుట్టిన తేది ఏప్రిల్ 11, 1953
నిర్వర్తించిన పదవులు
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఏడేండ్లు బాధ్యతలు
2000-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఐడీసీ చైర్మన్
2016-18 వరకు తెలంగాణ అసెంబ్లీ గ్రంథాలయ కమిటీ చైర్మన్
2009, 14, 18లో వరుసగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఎన్నిక