కొడంగల్, జనవరి 26 : రేవంత్రెడ్డిది ఆడిందే.. ఆట.. పాడిందే పాత కథ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2017లో రాజీనామా చేసిన రేవంత్ 2018లో ఏవిధంగా అభివృద్ధి పనులు మంజూరు చేయించాడో ప్రజలే ప్రశ్నించాలన్నారు. నిన్న కోస్గి సమావేశంలో కొడంగల్ను తానే(రేవంత్) అభివృద్ధి చేశానని చెప్పుకోడానికి సిగ్గులేదని విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని సీఎం కేసీఆర్కు అప్పటి మంత్రులు జూపల్లి కృష్ణారావు, డా.లక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితోపాటు తాను సీఎంతో చర్చించి అభివృద్ధి పనులకు నివేదిక అందించామన్నారు. సీఎం స్పందించి కొడంగల్, కోస్గి, మద్దూర్ దవాఖానలు, డిగ్రీ కళాశాల, దౌల్తాబాద్ మినీ ట్యాంక్బాండ్, గ్రామగ్రామానికి బీటీ రోడ్లు, కోస్గి బస్టాండ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు కాబడి ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గపరిధిలో రూ.300 కోట్లతో పీఆర్ రోడ్లు, రూ.200 కోట్లతో గ్రామగ్రామాన సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 80 శాతం వరకు రోడ్లు పూర్తయ్యాయని.. మిగిలిన పనులకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
వాస్తవాలను ప్రజలకు చెప్పుకోలేని సన్నాసి
వాస్తవాలను ప్రజలకు చెప్పుకోలేని సన్నాసి ఓ ప్రైవేటు చానల్ను అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారానికి ఒడికడుతున్నట్లు మండిపడ్డారురు. ‘నిఖార్సైన వ్యక్తివైతే ఎదురెదురుగా చూసుకుందాం.. రాజకీయ ఎదుగుదలకు కొడంగల్ను వాడుకున్నట్లు’విమర్శించారు. పీసీసీ పదవి నీకెలా వచ్చిందో పార్టీలోని సీనియర్, పార్లమెంటు నాయకులు ముక్తకంఠంతో విమర్శిస్తున్నారని, డబ్బులు కూడగట్టుకునేందుకే పీపీసీ పదవిని కొనుక్కున్నట్లు పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో 25కోట్లకు కాంగ్రెస్ కేడర్ను అమ్ముకున్నావని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును రూ.5కోట్లకు తాకట్టు పెడుతున్నట్లు మీ పార్టీ నాయకులే విమర్శిస్తున్నట్లు తెలిపారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి జీరోగా మారిందన్నారు. కొడంగల్ అభివృద్ధిని కోరుకున్నవాడివైతే.. అభివృద్ధికి సంబంధించి, సూచనలు సలహాలందించాలి కానీ ఉనికి చాటుకునేందుకు ఏడాదికోసారి నియోజకవర్గానికి వచ్చి నోటికి వచ్చిందల్లా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
దళితుల ఆర్థికాభివృద్ధికి దళిత బంధు
దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికీ రూ.10లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాలకు సంబంధించి 100 దళిత కుటుంబాల ఎంపికకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రూ.703కోట్లతో మహబూబ్నగర్-చించోలీ హైవేరోడ్డు మంజూరైందని, కొడంగల్ మీదుగా హైవేరోడ్డు వెళుతుండటంతో కొడంగల్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, జడ్పీటీసీ నాగరాణి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలున్నారు.